రాయపాటి లూటీలో బాబు వాటా ఎంత? | Jogi Ramesh Fires on Chandrababu And Rayapati Sambasiva Rao | Sakshi
Sakshi News home page

రాయపాటి లూటీలో బాబు వాటా ఎంత?

Dec 24 2020 3:53 AM | Updated on Dec 24 2020 7:09 AM

Jogi Ramesh Fires on Chandrababu And Rayapati Sambasiva Rao - Sakshi

సాక్షి,అమరావతి: బ్యాంకులను కొల్లగొట్టడంలో చంద్రబాబు అండ్‌ కో గ్యాంగ్‌స్టర్స్‌ని, స్కామ్‌స్టర్స్‌ని మించిపోయిందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే, పార్టీ అధికార ప్రతినిధి జోగి రమేష్‌ ధ్వజమెత్తారు. విజయ్‌ మాల్యా, నీరవ్‌మోడీ, దావూద్‌ ఇబ్రహీం కంటే ఘోరంగా దేశంపై పడి దోచుకుంటున్నారని మండిపడ్డారు. ట్రాన్స్‌ట్రాయ్‌ ముసుగులో టీడీపీ మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు పాల్పడిన రూ.7,296 కోట్ల స్కామ్‌లో చంద్రబాబుకు ఎంతిచ్చారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. బుధవారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు నీడలో పెరిగిన అవినీతి వృక్షం రాయపాటి అని వ్యాఖ్యానించారు. చంద్రబాబుకు వాటాలు లేకుంటే సీబీఐ దర్యాప్తుపై స్పందించాలని డిమాండ్‌ చేశారు. రాయపాటి, ట్రాన్స్‌ట్రాయ్‌ను ఐదేళ్లు నెత్తిన పెట్టుకుని మోసింది చంద్రబాబేనని గుర్తు చేశారు. ఆయన పాపాల పుట్ట ఒక్కొక్కటిగా కదులుతోందన్నారు. చంద్రబాబు బృందం అనినీతిపై విజయవాడలో ఏ సెంటర్‌లోనైనా చర్చకు తాను సిద్ధమని ప్రకటించారు. ఈ సవాల్‌ను స్వీకరించే సత్తా 40 ఇయర్స్‌ ఇండస్ట్రీకి ఉందా? అని ప్రశ్నించారు.

టీడీపీ అంటేనే కాంట్రాక్టర్ల పార్టీ..
రాయపాటి 9 నకిలీ కంపెనీలు ఏర్పాటు చేసి 13 బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని ఎగ్గొట్టారని, ఈ కుంభకోణంపై సీబీఐ కూపీ లాగుతోందని జోగి రమేష్‌ చెప్పారు. సుజనా చౌదరి, గంటా శ్రీనివాసరావు, సీఎం రమేష్, వాకాటి నారాయణరెడ్డి, దీపక్‌రెడ్డి, బొల్లినేని రామారావు వీరంతా బాబు బినామీలేనన్నారు. టీడీపీ అంటేనే కాంట్రాక్టర్ల పార్టీ అని వ్యాఖ్యానించారు. అవినీతి సామ్రాజ్యాన్ని స్థాపించి స్కామ్‌స్టర్లతో కూర్చుని చంద్రబాబు రోజూ ఆన్‌లైన్‌లో నీతి వ్యాఖ్యలు వల్లిస్తున్నారని దుయ్యబట్టారు.  

Advertisement
 
Advertisement
Advertisement