సాక్షి, గుంటూరు: నగరంలో అంబటి రాంబాబు ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. అంబటి ఇంట్లోకి పోలీసులు వెళ్లారు. ఎందుకు ఇంట్లోకి వచ్చారంటూ పోలీసులను అంబటి ప్రశ్నించగా.. నోటీసులు ఇవ్వడానికి వచ్చామంటూ తెలిపారు. ఏ నోటీసులు ఇస్తారో ఇవ్వండంటూ అంబటి రాంబాబు అన్నారు. దీంతో పోలీసులు మళ్లీ వస్తామంటూ చెప్పి వెళ్లిపోయారు. అంబటి నివాసానికి వైఎస్సార్సీపీ శ్రేణులు భారీగా చేరుకున్నారు.
గుంటూరులో మరోసారి తీవ్ర ఉద్రిక్తత
అంబటి ఇంటి వద్ద టీడీపీ మూకలు రెచ్చిపోయారు. బూతులు తిడుతూ టీడీపీ గూండాలు వీరంగం చేశారు దాడి చేసేందుకు టీడీపీ గూండాలు యత్నించారు. టీడీపీ గూండాలను వైఎస్సార్సీపీ శ్రేణులు అడ్డుకున్నారు.

తిరుమల లడ్డూ ప్రసాద విషయంలో కూటమి ప్రభుత్వ విష ప్రచారం తప్పని సీబీఐ నివేదికతో తేలిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గోరంట్లలో పాప ప్రక్షాళన కార్యక్రమం నిర్వహించేందుకు మాజీ మంత్రి, గుంటూరు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు అంబటి రాంబాబు బయల్దేరారు. అయితే.. గుంటూరు సెంటర్లో ఆయన్ని అడ్డుకున్న టీడీపీ గూండాలు.. దాడికి యత్నించారు. అయితే తృటిలో ఆయన ఆ దాడి నుంచి బయటపడ్డారు. అయితే దాడి సమయంలో కర్రలు, రాడ్లతో టీడీపీ కేడర్ హల్చల్ చేసింది.
మరోవైపు ప్లాన్ ప్రకారమే తనపై దాడికి యత్నించారన్న అంబటి రాంబాబు.. ఇటు పోలీసుల తీరుపైనా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘రాష్ట్రంలో చంద్రబాబు అరాచకాలు సృష్టిస్తున్నారు. కూటమి వేసిన ఫ్లెక్సీలకు పోలీసులు కాపలా కాయడం చూస్తుంటే.. అసలు పోలీస్ వ్యవస్థ బతికే ఉందా? అనే అనుమానాలు కలుగుతున్నాయి’’ అని ఆవేదన వ్యక్తం చేశారాయన.


