కోల్కతా: పశ్చిమ బెంగాల్లోని సోనార్పూర్లో మాజీ సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ బెనర్జీ పర్యటన సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆయనపై కొందరు గుడ్లు, రాళ్లు విసిరారు.
దీంతో అభిషేక్ బెనర్జీ తనకు రాళ్లు, గుడ్లు తగలకుండా హెల్మెట్ పెట్టుకున్నారు. ఈ ఘటన సమయంలో నిరసనకారులు “చోర్ చోర్” అంటూ నినాదాలు చేశారు. అభిషేక్ బెనర్జీ రాకను వ్యతిరేకిస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో కొంతసేపు ఉద్రిక్తత నెలకొనగా, భద్రతా సిబ్బంది పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.
ఎన్నికల అనంతరం హింస జరగడంతో బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్లిన సమయంలో ఆయనపై ఈ దాడి జరిగింది. దాడి జరుగుతున్న వేళ భద్రతా సిబ్బంది అభిషేక్ బెనర్జీని చుట్టుముట్టి రక్షణ కల్పించారు ఘటనాస్థలిలో ఉద్రిక్తత పెరగడంతో భద్రతా సిబ్బంది ఆయనను సురక్షితంగా అక్కడి నుంచి తరలించారు.
దాడిపై స్పందించిన అభిషేక్ బెనర్జీ.. ఈ ఘటన వెనుక బీజేపీ హస్తం ఉందని ఆరోపించారు. “ఇది పూర్తిగా బీజేపీ ప్రేరేపిత చర్య. ప్రజాస్వామ్యం అంటే ఇదేనా? ఎన్నికల ఫలితాలు వచ్చి నెల కూడా కాలేదు. అయినా పోలీసులు ఎక్కడా కనిపించడం లేదు” అని వ్యాఖ్యానించారు. దాడికి పాల్పడిన వారి గుర్తింపు, ఘటనకు దారితీసిన కారణాలపై విచారణ కొనసాగుతోంది.
#WATCH | Sonarpur, West Bengal: TMC MP Abhishek Banerjee was beaten up by locals during his visit to Sonarpur to meet the post-poll victims' families pic.twitter.com/zkXxLJydqe
— ANI (@ANI) May 30, 2026


