కాంగ్రెస్‌ పాలనలో అన్ని వర్గాలకు న్యాయం: సీఎం రేవంత్‌ | Devarakonda Public Meeting: Cm Revanth Reddy Fires On Kcr | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ పాలనలో అన్ని వర్గాలకు న్యాయం: సీఎం రేవంత్‌

Dec 6 2025 9:17 PM | Updated on Dec 7 2025 11:29 AM

Devarakonda Public Meeting: Cm Revanth Reddy Fires On Kcr

సాక్షి, నల్గొండ జిల్లా: రైతులకు ఉచిత విద్యుత్‌ను అందించిందే దివంగత నేత వైఎస్సార్ అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. శనివారం ఆయన దేవరకొండ బహిరంగ సభలో మాట్లాడుతూ.. వేలాది మంది రైతులకు విద్యుత్ బిల్లులను వైఎస్సార్ మాఫీ చేశారని గుర్తు చేశారు. కేసీఆర్‌కు అవకాశం వస్తే మంచి రోజులు కాదు.. ముంచే రోజులు వస్తాయంటూ రేవంత్‌ వ్యాఖ్యానించారు. రాష్ట్రాన్ని కేసీఆర్, కేటీఆర్, హరీష్ నలుగురు కలిసి పీక్కుతిన్నారంటూ ఆయన ఆరోపించారు.

‘‘కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాలకు న్యాయం జరిగింది. ఎస్‌ఎల్‌బీసీని పదేళ్లలో పది కిలోమీటర్ల దూరం తవ్వలేకపోయారు. ఎస్‌ఎల్‌బీసీలో ఎనిమిది మంది చనిపోతే మామా అల్లుళ్లు డ్యాన్స్‌లు చేస్తున్నారు. పదెకరాల్లో 150 రూమ్‌లతో కేసీఆర్ గడీని నిర్మించుకున్నాడు. లంబాడీలను ఎస్టీల్లో చేర్చిందే కాంగ్రెస్ పార్టీ. రైతు రుణమాఫీ చేస్తామని మోసం చేసి రైతుల నెత్తిన అప్పు, చేతిలో కేసీఆర్ చిప్ప పెట్టిండు. ఓటు అనే ఆయుధంతో గడీల పాలనను కూల్చారు. గత ప్రభుత్వానికి రేషన్ కార్డు ఇవ్వాలన్న సోయి కూడా లేకుండా పోయింది.

..కాంగ్రెస్ హయాంలో పేదలకు సన్నబియ్యం పంపిణీ చేస్తున్నాం. బీజేపీ పాలనలో ఉన్న ఏ రాష్ట్రంలోనైనా సన్నబియ్యం ఇస్తున్నారా?. గత పదేళ్లలో ఒక్క డబుల్ బెడ్ రూమ్ ఇవ్వలేదు. ఏ ఊర్లో డబుల్ బెడ్ రూమ్ ఇచ్చినవో చెప్తే ఆ ఊర్లో ఓట్లు అడగాలని కేసీఆర్‌కు సవాల్ చేశాం. పేదవాళ్ల పట్ల కేసీఆర్‌కు ఏ మాత్రం ప్రేమ, అభిమానాలు లేవు. మద్దిమడుగులో సేవాలాల్ విగ్రహం ఏర్పాటు చేస్తాం. నమ్మించి నట్టేట ముంచినోడు.. ఒకవైపు నమ్మినోళ్ల కోసం పనిచేసేటోడు ఒకవైపు ఉన్నారు ఎవరు కావాలో జనాలు తేల్చుకోండి. దేశానికి ఆదర్శంగా నిల్చేలా తెలంగాణను రోల్ మోడల్‌గా తయారు చేస్తాం’’ అని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement