
ఆత్మకూరు (శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా): కుటుంబ రాజకీయాలకు భారతీయ జనతా పార్టీ దూరమని, వాటిని ప్రోత్సహించదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. ఎవరైనా పదవుల్లోని వ్యక్తి చనిపోతే జరిగే ఉపఎన్నికల్లో పోటీ చేయబోమని, అది తమ పార్టీ విధానమని తెలుగుదేశం పార్టీ పేర్కొంటోందని, అయితే గతేడాది జరిగిన తిరుపతి పార్లమెంట్ స్థానానికి ఎందుకు పోటీ చేశారని, పార్లమెంట్కు ఓ విధానం, అసెంబ్లీకి మరో విధానం ఆ పార్టీ సిద్ధాంతమా అని సోము వీర్రాజు ప్రశ్నించారు.
ఆత్మకూరు శాసనసభ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా భరత్కుమార్ నామినేషన్ దాఖలు చేసే కార్యక్రమంలో శనివారం ఆయన పాల్గొన్నారు. నామినేషన్ దాఖలు చేసిన అనంతరం ఆర్డీవో కార్యాలయ ఆవరణలో జరిగిన మీడియా పాయింట్లో విలేకరులతో మాట్లాడారు.
ప్రధాన మంత్రి మోదీ అమలు చేసిన సంక్షేమ పథకాలను వివరిస్తూ బీజేపీ అభ్యర్థి ప్రచారం నిర్వహిస్తారన్నారు. మీడియా సమావేశంలో కర్నాటి ఆంజనేయరెడ్డి, సురేంద్రరెడ్డి, సురేష్ రెడ్డి, ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి, కాకు విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.