ఓల్డ్‌ సిటీలోకి వెళ్లే దమ్ము రేవంత్‌ సర్కార్‌కు లేదా?: ఏలేటి | Bjlp Leader Alleti Maheshwar Reddy Comments On Hydra | Sakshi
Sakshi News home page

ఓల్డ్‌ సిటీలోకి వెళ్లే దమ్ము రేవంత్‌ సర్కార్‌కు లేదా?: ఏలేటి

Aug 29 2024 8:29 PM | Updated on Aug 29 2024 8:35 PM

Bjlp Leader Alleti Maheshwar Reddy Comments On Hydra

హైడ్రా పేరుతో లేనిపోని హైక్‌ను సృష్టిస్తున్నారని.. బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

సాక్షి, హైదరాబాద్‌: హైడ్రా పేరుతో లేనిపోని హైక్‌ను సృష్టిస్తున్నారని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. హైడ్రా రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిందని.. రంగనాథ్ కమిషనరా..? పొలిటికల్ లీడరా..? అంటూ ఆయన ప్రశ్నించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, కేవలం హిందువుల నిర్మాణాలను కూల్చడమే పనిగా పెట్టుకున్నారా..?. ఐపీఎస్ అధికారిగా తనకు తాను మీడియా ముందు బిల్డప్ చేసుకుంటున్నారని దుయ్యబట్టారు.

‘‘హైడ్రా పేరుతో పెద్ద ఎత్తున వసూళ్లు నడుస్తున్నాయని వార్తలు వస్తున్నాయి. సల్కం చెరువులో ఓవైసీ నిర్మాణాలకు ఉన్న కండీషన్లు, పల్ల రాజేశ్వర్ రెడ్డి, మర్తి రాజేశ్వర్‌రెడ్డికి వర్తించవా..?. ఓవైసీకీ ఆరు నెలలు సమయం ఇస్తున్నప్పుడు, మిగతా వారికి, ఎన్ కన్వెన్షన్‌కు ఎందుకు సమయం ఇవ్వలేదు..?. ఓల్డ్ సిటీలోకి వెళ్లే దమ్ము, ధైర్యం ప్రభుత్వానికి లేదా..?. ఓ వైసీని ఢీకొట్టడానికి ధైర్యం సరిపోవడం లేదా..?. ఆయన ఇనిస్టిట్యూషన్‌లో మాత్రమే విద్యార్థులున్నారా..?. రంగనాథ్‌కు ఆఫర్ ఇచ్చారేమో అందుకే ఓల్డ్ సిటీలోకి వెళ్లడం లేదు. కేవలం టార్గెట్ చేసి నిర్మాణాలను కుల్చుతున్నారా అనే అనుమానం కలుగుతుంది’’ అంటూ మహేశ్వర్‌రెడ్డి ఆరోపించారు.

‘‘కాంగ్రెస్ సర్కారు స్టీరింగ్ ఓవైసీ చేతిలో ఉంది. వంద శాతం చెరువు కబ్జా అయితే ముట్టుకోమని రంగనాథ్ చెబుతున్నారు. రంగనాథ్ ఏం పొడిచారని ఆయనకు హై సెక్యూరిటీ కల్పిస్తున్నారు. ఈ హైక్ ఏంది..? ఈ హైడ్రా ఏంది అర్థం కావడం లేదు. తీవ్రవాదులను, టెర్రరిస్టులను పట్టుకున్న పోలీస్ అధికారులు ఎంతో మంది ఉన్నారు. వారికిలేని సెక్యూరిటీ రంగనాథ్‌కు ఎందుకు..?. కేవలం హిందువుల నిర్మాణాలను కూల్చడమే టార్గెట్ పెట్టుకుంటే ఊరుకునేది లేదు. ఓల్డ్ సిటీలోకి వెళ్లేందుకు హైడ్రాకు దారి తెలవడం లేదా..?. డిస్క్రిమినేషన్ పద్ధతి మంచిది కాదు. ఇలాంటి పద్ధతులతో వెళ్తే రంగనాథ్ పై ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేస్తాం’’ అంటూ ఏలేటి హెచ్చరించారు.

‘‘రంగనాథ్‌కు ఎమ్మెల్సీ ఇచ్చుకోండి, రాజ్యసభ ఇచ్చుకోండి, కానీ ఇంత హైక్ ఎందుకు చేస్తున్నారు?. ఒక వర్గాన్ని టార్గెట్ చేస్తూ ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఓవైసీ ఉప ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారు. అందుకే ఓవైసీ నిర్మాణాలను ముట్టుకోలేకపోతున్నారు. సల్కం చెరువులో అక్రమ నిర్మాణాలను కూల్చిన తరువాతే ఇతర చెరువులకు వెళ్ళాలి. పాతబస్తీలో ఎన్ని చెరువులున్నాయి. ఎన్ని ఎకరాల భూములు కబ్జాలకు గురయ్యాయినేది డేటా ప్రభుత్వం సేకరించాలి’’ అని ఏలేటి మహేశ్వర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement