
సాక్షి, ఢిల్లీ: ఎన్నికల వేళ ఏపీలో రాజకీయం రసవత్తరంగా మారింది. ఇప్పటికే టీడీపీ రెండు పార్టీలో కలిసి కూటమిని ఏర్పాటు చేయగా.. ఇటు కాంగ్రెస్లో ట్విస్ట్లు చోటుచేసుకుంటున్నాయి. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కాంగ్రెస్ సీనియర్లు వెనకడుగు వేస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో, హైకమాండ్ కొందరిని బలవంతంగా బరిలో దించే ప్రయత్నం చేస్తోంది.
కాగా, ఏపీలో ఎన్నికలకు సంబంధించి దాదాపు అన్ని సర్వేల్లో వైఎస్సార్సీపీకే అనుకూల ఫలితాలు వస్తున్నాయి. దీంతో, ప్రతిపక్ష పార్టీల నేతలు ఎన్నికల్లో పోటీకి జంకుతున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నేతలు ఎన్నికల్లో పోటీ అంటేనే భయపడిపోయి.. వెనకడుగు వేస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో హస్తం పార్టీలో సీనియర్ నేతలు కూడా పోటీ చేసేందుకు ముందుకు రావడం లేదు. గత ఎన్నికల్లో వైఎస్సార్సీపీ దెబ్బకు కాంగ్రెస్ పార్టీ కనుమరుగైంది. ఎన్నికల్లో డిపాజిట్ కూడా గల్లంతైంది. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో పోటీపై ఎవరూ ఆసక్తి చూపించడం లేదు.
ఇక, కాంగ్రెస్లో సీనియర్ నేతలైన రఘువీరా రెడ్డి, కేవీపీ వంటి సీనయర్లు కూడా పోటీకి దూరంగా ఉంటున్నారు. ఎన్నికల్లో పోటీ చేసేదిలేదని చెప్పినట్టు తెలుస్తోంది. దీంతో, మరో మార్గం లేక పల్లం రాజు, గిడురు రుద్రరాజులను కాంగ్రెస్ అధిష్టానం బలవంతంగా దించే ప్రయత్నం చేస్తోందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో ఓడిపోయే దానికి ఎందుకు తమను బలి చేస్తారని సీనియర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని సమాచారం. ఎన్నికల్లో కనీసం డిపాజిట్ రాకపోతే పార్టీలో పరువు పోతుందునే ఆలోచన వారు ఉన్నారు. ఈ క్రమంలో పార్టీ హైకమాండ్ పెద్దలను కలిసి పోటీ నుంచి వారిని తప్పించాలని వేడుకుంటున్నట్టు తెలుస్తోంది.