లక్నో:ఎన్నికల వ్యూహకర్తగా దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్న ప్రశాంత్ కిషోర్కు బిగ్షాక్ తగిలింది. ప్రశాంత్ కిషోర్ సంస్థ ఐపాక్ సేవలు ఇకపై తమకు అవసరం లేదని ఉత్తర ప్రదేశ్ ప్రతిపక్ష సమాజ్వాద్ పార్టీ తేల్చి చెప్పింది. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు ఉన్నా ఆ పార్టీ అధినేత, ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ తాజా నిర్ణయం చర్చాంశనీయంగా మారింది.
సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ 2027 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఐపాక్ (I-PAC)తో సంబంధాలు తెంచుకున్నారు. పార్టీ ఇకపై ఐపాక్తో పనిచేయదు. ‘మాకు నిధులు లేవు. మీరు (మీడియా) నిధులు ఇస్తే మరో సంస్థను కూడా పెట్టుకుంటాం’ అని సరదాగా వ్యాఖ్యానించారు. ఐపాక్ గతంలో సమాజ్వాదీ పార్టీతో కలిసి 2022 ఎన్నికల్లో తక్కువ తేడాతో ఓడిపోయిన నియోజకవర్గాల్లో వ్యూహాలు రూపొందించాల్సి ఉంది. కానీ ఇప్పుడు ఆ ఒప్పందం రద్దయింది. సమాజ్వాదీ పార్టీ మాత్రం మరో సంస్థ షోటైమ్తో ఒప్పందం కొనసాగిస్తుందని తెలిపారు.
టీఎంసీ, డీఎంకే ఓటమి
అఖిలేష్ యాదవ్కు ఈ నిర్ణయానికి కారణంగా పశ్చిమ బెంగాల్ బొగ్గు అక్రమ రవాణా కేసులో ఐపాక్ సహ వ్యవస్థాపకుడు వినేష్ చాందెల్ అరెస్టు, ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఐపాక్ సేవలందించిన పశ్చిమ బెంగాల్లో టీఎంసీ, తమిళనాడులో డీఎంకే ఓటమి తరువాత ఈ నిర్ణయం తీసుకున్నారు.
విస్మయంలో మమతా బెనర్జీ, ఎంకే స్టాలిన్ ఓటమి
పశ్చిమ బెంగాల్ బొగ్గు అక్రమ రవాణా కేసు. ఈ కేసులో ఐపాక్ సహ వ్యవస్థాపకుడు వినేష్ చాందెల్ను ఈడీ అరెస్టు చేసింది. ఆయనపై హవాలా మార్గాల ద్వారా కోట్ల రూపాయలు ఐపాక్కి తరలించారని ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసు ఐపాక్ విశ్వసనీయతపై ప్రశ్నలు లేవనెత్తింది. బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ను బీజేపీ 207 సీట్లతో చిత్తు చేసింది. తమిళనాడులో డీఎంకే గద్దె దిగింది. ముఖ్యంగా మమతా బెనర్జీ, ఎంకే స్టాలిన్ తమ బలమైన నియోజకవర్గాల్లోనే ఓడిపోవడం విస్మయానికి గురి చేసింది. వెరసీ ఐపాక్తో కలిసి పని చేయడం కంటే దూరం పెట్టడమే మంచిదని భావించే అఖిలేష్ యాదవ్ ఈ నిర్ణయం తీసుకున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
అఖిలేష్ మాత్రం ఈ నిర్ణయం ఎన్నికల ఫలితాలకు సంబంధం లేదని స్పష్టం చేశారు. ‘అవును, మాకు వారితో సంబంధం ఉంది. కొన్ని నెలలు పనిచేశారు. కానీ మాకు ఆ స్థాయి నిధులు లేవు కాబట్టి కొనసాగించలేకపోతున్నాం’ అని ఆయన అన్నారు.
అఖిలేష్ యాదవ్కు డూ ఆర్ డైగా ఎన్నికలు
అయితే ,ఐపాక్ వైఫల్యం, వినేష్ చాందెల్ అరెస్టు, ఈడీ దర్యాప్తు అన్నీ కలిపి సమాజ్వాదీ పార్టీకి ఆలోచన కలిగించాయి. ఇప్పటికే ఐపాక్ ఉత్తరప్రదేశ్లో తన కార్యకలాపాలను తగ్గించిందని, అందులో ఉద్యోగుల సంఖ్యను సగానికిపైగా తగ్గించినట్లు సమాచారం. ఇది పార్టీ ఎన్నికల సన్నాహాలను దెబ్బతీసింది. 2027 ఎన్నికలు అఖిలేశ్ యాదవ్కి డూ ఆర్ డై అన్నచందంగా మారాయి. బీజేపీకి వ్యతిరేకంగా ఉత్తరప్రదేశ్లో ఏకైక బలమైన ప్రత్యామ్నాయం సమాజ్వాదీ పార్టీగా భావిస్తున్నారు. కానీ ఐపాక్ విడిపోవడం, ఈడీ కేసులు, ఇతర రాష్ట్రాల్లో ప్రతిపక్షాల పరాజయాలు ఇవన్నీ అఖిలేష్కి పెద్ద సవాళ్లుగా మారాయి.


