పెద్దపల్లి: గర్భంలోని శిశువు లింగాన్ని స్కానింగ్ ద్వారా వెల్లడించడం చట్టవిరుద్ధమని, అలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రీకన్సెప్షన్ అండ్ ప్రీనేటల్ డయాగ్నస్టిక్ టెక్నిక్స్ జిల్లా సలహా కమిటీ సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో పీసీపీఎన్డీటీ చట్టాన్ని కచ్చితంగా అమలు చేయాలని అన్నారు. స్కానింగ్ కేంద్రాలపై నిరంతర పర్యవేక్షణ చేపట్టి చట్ట ఉల్లంఘనలకు అవకాశం లేకుండా చూడాలని ఆదేశించారు. జిల్లాలో సహజ ప్రసవాలను మరింతగా ప్రోత్సహించి, అనవసర సిజేరియన్ శస్త్రచికిత్సలను తగ్గించే దిశగా వైద్యశాఖ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు. సమావేశంలో జిల్లా వైద్యాధికారి పవిత్ర, ప్రోగ్రాం అధికారి లక్ష్మీభవాని, డిప్యూటీ డీఎంహెచ్వో శ్రీరాములు, సంబంధిత ఎస్సై, లయన్స్ క్లబ్ అధ్యక్షులు, వైద్యాధికారులు తదితరులు పాల్గొన్నారు.
సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకోవాలి
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు మెరుగుపర్చేందుకు ఆధునిక బోధన విధానాలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని కలెక్టర్ శ్రీహర్ష సూచించారు. సోమవారం జిల్లాకేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్ బాలుర పాఠశాల (అమర్నగర్)లో నిర్వహిస్తున్న సమగ్ర సేవా శిక్షణను సందర్శించారు. శిక్షణ ద్వారా విద్యార్థుల అభ్యసన ఫలితాల మెరుగుదల, డిజిటల్ లిటరసీ, కృత్రిమ మేధస్సు, వినూత్న బోధన పద్ధతులపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఈవో శారద, షేక్, మల్లేశం గౌడ్, ప్రతినిధులు, మాస్టర్ ట్రైనర్లు, ప్రధానోపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.


