● జిల్లాలో పెరిగిన ఉష్ణోగ్రతలు
● ఇంట్లో ఉన్నా వడదెబ్బకు గురయ్యే ప్రమాదం
● గోదావరిఖని జీజీహెచ్ ఇన్చార్జి ఆర్ఎంవో డాక్టర్ దండె రాజు
కోల్సిటీ(రామగుండం): జిల్లాలో పగటి ఉష్ణోగ్రతలు పెరిగి జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఎండ తీవ్రతతో తలనొప్పి, తదితర సమస్యలతో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకు వస్తున్నట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో సన్స్ట్రోక్కు గురైనప్పుడు తీసుకోవాల్సిన పలు జాగ్రత్తల గురించి గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి(జీజీహెచ్) ఇన్చార్జి ఆర్ఎంవో డాక్టర్ దండె రాజు వివరించారు.
ఎండల ప్రభావం ఎవరిపై ఎక్కువ..?
ఎండల ప్రభావం మధుమేహం, రక్తపోటు ఉన్నవారు, వృద్ధులు, గర్భిణులు, చిన్నారులు, స్మోకర్స్, ఆల్కాహాల్ సేవించేవారిపై ఎక్కువగా ఎండల ప్రభావం ఉంటుంది. ఇలాంటి వారు ఎండలోకి కొద్దిసేపు వెళ్లినా సన్స్ట్రోక్కు గురవుతారు. తలుపులన్నీ మూసి వేస్తే ఇంట్లో ఉన్న వృద్ధులు, చిన్నారులు సైతం వేడి ప్రభావంతో శరీరం డీ హైడ్రేషన్కు గురవుతుంది. ఇలాంటి వారు వడగాలుల ప్రభావం పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
వడగాలులు తగలకుండా ఏమి చేయాలి..?
బయటకు వెళ్లేటప్పుడు తలకు తెల్లని టోపీలు పెట్టుకోవాలి. కళ్లజోడుతోపాటు, చెవులు, ముక్కులోకి వేడిగాలులు ప్రవేశించకుండా కర్చీఫ్ కట్టుకుంటే మంచిది. వేసవి సెలవుల్లో ఎక్కువ మంది చిన్నారులు స్కిన్ ఇన్ఫెక్షన్స్తో బాధపడుతున్నారు. ఎండలో ఆటలాడే సమయంలో తరచూ ముఖాన్ని నీటితో కడుక్కోవడం ద్వారా కళ్లకు సరిపడా తేమ లభిస్తుంది.
ఆహారంలో పాటించాల్సిన నియమాలు..?
వడగాలులకు శరీరంలోని నీరు ఆవిరై డీ హైడ్రేషన్కు గురయ్యే ప్రమాదం ఉంటుంది. తరచూ ద్రవపదార్థాలు అధికంగా తీసుకోవాలి. కూల్డ్రింక్స్, ఐస్క్రీమ్స్ కంటే పళ్ల రసాలు, కొబ్బరినీళ్లు, మజ్జిగ తాగితే మంచిది. పుచ్చకాయ, నిమ్మరసం, ద్రాక్షలో ఎక్కువ నీటి శాతం ఉంటుంది. రోజులో 4 నుంచి 5 లీటర్లు నీరు తాగాలి. కాచి చల్లార్చిన నీరు తాగితే మంచిది.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు..?
సన్స్ట్రోక్ లక్షణాలు..?
తలనొప్పి, అధిక జ్వరం (107 డిగ్రీల టెంపరేచర్), శరీరం డీహైడ్రేషన్కు గురికావడంతో స్పృహ కోల్పోవడం, వాంతులు, విరేచనాలు, గుండె వేగంగా కొట్టుకోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. వడదెబ్బకు గురై స్పృహ కోల్పోయిన సమయంలో శరీరంపై ఉన్న దుస్తులు తొలగించి, నీడప్రదేశంలోకి తీసుకెళ్లాలి. శరీరాన్ని తడి వస్త్రంతో తుడిచి వీలైనంత త్వరగా ఆస్పత్రికి తీసుకెళ్లాలి. ఐవీ ఫ్లూయిడ్స్ ఎక్కించి చికిత్స అందిస్తారు. శరీరం డీహైడ్రేషన్కు గురైన సమయంలో అశ్రద్ధ చేస్తే, గుండె, కిడ్నీలు, మెదడుపై తీవ్ర ప్రభావం చూపి, మృతిచెందే అవకాశాలుంటాయి.


