సాక్షి పెద్దపల్లి:
బీజేపీ రాష్ట్ర నూతన కార్యవర్గాన్ని ఆ పార్టీ అధ్యక్షుడు ప్రకటించారు. అందులో జిల్లాకు పెద్దపీట దక్కింది. శాశ్వత ఆహ్వానితులుగా, రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా, ప్రత్యేక ఆహ్వానితులతో ఏర్పాటు చేసిన రాష్ట్ర కమిటీలో జిల్లానుంచి ఏకంగా ఏడుగురికి చోటుకల్పించారు. పార్టీని బలోపేతం చేసేందుకు ప్రతీఒక్కరు కృషి చేయాలని కమలం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు నేతలకు పిలుపునిచ్చారు. అయితే జిల్లాలో బీజేపీ పరిస్థితి అల్లకల్లోలంగా ఉంది. బీజేపీలోని నలుగురైదుగురు నాయకులు కూడా ‘తలోదారి’ అన్నట్లు తయారైంది. కొత్త, పాత నేతలు గ్రూపులుగా విడిపోవడంతో పార్టీ అస్తవ్యస్తంగా మారింది. నాయకుల మధ్య సయోధ్య కుదరడం లేదు. ‘ఎవరికివారు.. యము నా తీరు’ అన్న చందంగా వ్యవహరిస్తున్నారనే విమ ర్శలు ఉన్నాయి.. దీంతో ఇటీవల జరిగిన పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో ఘోర పరాభావం పాలైంది. స్థానిక ఎన్నికల్లో ఓటమి పాలైనా.. రాష్ట్ర కార్యవర్గంలో పలువురు నేతలకు చోటు లభించడంతో బీజేపీ జిల్లా నేతల్లో జోష్ కనిపిస్తోంది.
మనోళ్లే ఏడుగురు
బీజేపీ రాష్ట్ర కార్యవర్గంలో పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి, గోదావరిఖనికి చెందిన కాసిపేట లింగయ్య, మాజీ ఎంపీ వెంకటేశ్ నేతలకు ప్రత్యేక ఆహ్వానితులుగా చోటు లభించింది. రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా గోదావరిఖనికి చెందిన బల్మూరి వనిత, జూలపల్లికి చెందిన నల్లా మనోహర్రెడ్డి, మంథని నుంచి చందుపట్ల సునీల్రెడ్డి, పెద్దపల్లి నుంచి దుగ్యాల ప్రదీప్రావులకు రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా అవకాశం కల్పించారు.
కలిసి నడిస్తేనే..
గత పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ను వెనక్కి నెట్టి రెండోస్థానంలో నిలిచిన బీజేపీ.. ఆ తర్వాత జరిగిన టీచర్స్, పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో రెండు ఎమ్మెల్సీ స్థానాలనూ కై వసం చేసుకుని సత్తా చాటింది. ఆ తర్వాత జరిగిన స్థానిక సంస్థల్లో అభ్యర్థుల త రఫున ప్రచారం, దిశానిర్దేశం చేసే నేతలు లేక చతికిలబడ్డారు. దీనికి ప్రధానంగా నేతల మధ్య నెలకొన్న అనైక్యతే కారణమని సొంతపార్టీ నేతలే బాహాటంగా ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం రెండున్నరేళ్ల పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో.. ఇప్పటి నుంచైనా పార్టీ పదవులు పొందిన బీజేపీ నేతలు కలిసికట్టుగా శ్రమించాలంటున్నారు. కేడర్కు మార్గనిర్దేశనం చేస్తూ, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడితే వచ్చే జిల్లా పరిషత్ ఎన్నికల్లో సత్తా చాటవచ్చని భావిస్తున్నారు. తద్వారా అసెంబ్లీ ఎన్నికల నాటికి బలపడవచ్చని కమలం శ్రేణులు అభిప్రాయపడుతున్నారు.
బీజేపీ రాష్ట్ర కార్యవర్గంలో ఏడుగురు జిల్లావాసులకు చోటు
పదవుల పందేరంతో పువ్వుగుర్తు పార్టీలో నయా జోష్
పార్టీ బలోపేతానికి సమష్టిగా పనిచేయాలంటున్న కేడర్


