
‘ఎల్లంపల్లి’కి భారీ ఇన్ఫ్లో
రామగుండం: ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భారీ ఇన్ఫ్లో వస్తోంది. ఎల్లంపల్లి నీటిమట్టం 20.175 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 15.9 టీఎంసీలు ఉన్నాయి. ఎస్సారెస్పీ నుంచి 3.41 లక్షలు, కడెం నుంచి 4,144, వరద నీరు 2.58 లక్షల క్యూసెక్కులు మొత్తం 6.03 లక్షల క్యూసెక్కులు ఇన్ఫ్లో వస్తోంది. ప్రాజెక్టు 40 గేట్లు ఎత్తి 6.38 లక్షల క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు.
కాత్యాయినీగా అమ్మవారు
పెద్దపల్లిరూరల్: పెద్దపల్లిలోని శ్రీలక్ష్మీ గణపతి సంతోషిమాత ఆలయంలో గురువారం కాత్యాయినీ రూపంలో అమ్మవారు దర్శనమిచ్చారు. ఆలయ భూదాత గంప శ్రీరామలు, ప్రభాదేవి దంపతులు ఆలయ నిర్వహణకు ప్రతినెలా రూ.5వేలు ఇచ్చేందుకు ముందుకొచ్చారు.
పార్వతీ బ్యారేజ్కు వరద తాకడి
మంథనిరూరల్: ఎగువన ఎల్లంపల్లి గేట్లు ఎత్తి నీటిని విడుదల చేయడంతో మంథని మండలం సిరిపురం సమీపంలోని పార్వతీ బ్యారేజ్కు పెద్ద ఎత్తున వరద చేరుతోంది. బ్యారేజ్ 74గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. గురువారం సాయంత్రం వరకు పార్వతీ బ్యారేజ్కు 6.98లక్షల క్యూసెక్కుల నీరు చేరుతుండగా అంతే స్థాయిలో దిగువకు వదులుతున్నారు.
నేడు పేరెంట్, లెక్చరర్ల సమావేశం
పెద్దపల్లిరూరల్: జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో శుక్రవారం పేరెంట్, లెక్చరర్ల సమావేశం నిర్వహించనున్నట్టు ఇంటర్ నోడల్ అధికారి కల్పన తెలిపారు. జిల్లాలోని 14 కాలేజీల్లో (ఎక్కడి కాలేజీ పేరెంట్స్, లెక్చరర్స్ అక్కడే) ప్రిన్సిపాల్, అధ్యాపకుల ఆధ్వర్యంలో సమావేశం ఉంటుందన్నారు. ఈ మేరకు సమావేశానికి రావాలంటూ తల్లిదండ్రులకు ఆహ్వానపత్రికలను అందించినట్టు పేర్కొన్నారు. విద్యార్థుల విద్యాప్రగతి, క్రమశిక్షణ త దితర విషయాలపై తల్లిదండ్రుల నుంచి తెలుసుకునేందుకు వీలుంటుందన్నారు. తల్లిదండ్రులు తప్పనిసరిగా హాజరు కావాలన్నారు.
క్షయ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి
మంథనిరూరల్: జిల్లాను క్షయరహితంగా తీర్చిదిద్దుకోవడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని డీఎంహెచ్వో డాక్టర్ వాణిశ్రీ అన్నారు. గురువారం మంథని మండలం గద్దలపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇంపాక్ట్ ఇండియా ప్రాజెక్టు డిస్ట్రిక్ట్ లీడ్ దేవోజు శ్రీనివాస్ పీహెచ్సీ పరిధిలో టీబీ నుంచి కోలుకున్న 30మందికి శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, వ్యాధి లక్షణా లు కన్పిపిస్తే వెంటనే పరీక్షలు నిర్వహించి నిర్ధారించి మందులు అందజేయాలన్నారు. డెప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ రవి, డాక్టర్ సృజన్, సిబ్బంది పాల్గొన్నారు.
అవార్డు అందుకున్న జగదీశ్వర్
జ్యోతినగర్(రామగుండం): జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును గడ్డం జగదీశ్వర్ అందుకున్నా రు. గురువారం శారదా ఎడ్యుకేషనల్ సొసైటీ, హైదరాబాద్ బిర్లా ప్లానిటోరియం భాస్కర నిలయంలో జరిగిన కార్యక్రమంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మల్క కొమురయ్య చేతుల మీదుగా అవార్డు స్వీకరించారు. ఎన్టీపీసీ రామగుండం అన్నపూర్ణకాలనీలోని దుర్గయ్యపల్లె ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లిష్ టీచర్గా విధులు నిర్వహిస్తున్న జగదీశ్వర్ అవార్డు అందుకోవడంపై పలువురు అభినందించారు.