తెర్లాం: మండలంలోని పూనువలస పంచాయతీ పరిధి జె.కొత్తవలస గ్రామంలో ప్రబలిన జ్వరాలను అదుపు చేసేందుకు అవసరమైన చర్యలను పంచాయతీ, వైద్యశాఖల అధికారులు చేపట్టారు. ‘జె.కొత్తవలసలో జ్వరాల వణుకు’ శీర్షికన గురువారం ‘సాక్షి’లో ప్రచురితమైన వార్తకు జిల్లా పంచాయతీ, వైద్యారోగ్యశాఖ అధికారులు స్పందించారు. గ్రామంలో పారిశుద్ధ్య పనులు చేపట్టాలని, జ్వరాలపై ఇంటింటి సర్వే నిర్వహించి అవసరమైన వైద్యసేవలు అందించాలని పంచాయతీ, వైద్యసిబ్బందిని ఆదేశించారు. ఆ మేరకు పంచాయతీ ప్రత్యేకాధికారి డాక్టర్ జె.నరేంద్రకుమార్, పంచాయతీ కార్యదర్శి కర్రి ప్రసాద్ గ్రామంలో పారిశుద్ధ్య పనులు చేపట్టారు. పెరుమాళి పీహెచ్సీ వైద్యుడు వెంకటేశ్, ఆయుర్వేద వైద్యుడు ఎస్.శ్రీనివాసరావు సిబ్బందితో కలిసి ఇంటింటి ఫీవర్ సర్వే నిర్వహించారు. జ్వరపీడితుల రక్త నమూనాలను సేకరించారు. జ్వరపీడితులకు అవసరమైన మందులు అందజేశారు. ప్రస్తుతం జ్వరాలు అదుపులో ఉన్నట్టు డాక్టర్ వెంకటేశ్ తెలిపారు.


