● నాలుగు రోజుల వ్యవధిలో భార్యాభర్తలు మృతి
● తెర్లాం మండలం వెలగవలసలో విషాదం
తెర్లాం: అగ్ని సాక్షిగా ఒక్కటయ్యాం.. తోడునీడగా బతికాం.. నీవు లేని లోకంలో నేను జీవించలేను అన్నట్టుగా భార్య చనిపోయిన నాలుగురోజుల వ్యవధిలోనే భర్త చనిపోయిన విషాదకర ఘటన తెర్లాం మండలం వెలగవలసలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, గ్రామస్తుల్లో విషాదం నింపింది. వివరాల్లోకి వెళ్తే.. వెలగవలస గ్రామానికి చెందిన మీసాల తౌడ మ్మ, తాతనాయుడు భార్యాభర్తలు. తౌడమ్మ (65) గుండెపోటుతో శనివారం మృతి చెందింది. ఆమె అంత్యక్రియలను భర్త, కుటుంబ సభ్యులు నిర్వహించారు. భార్య మృతిని జీర్ణించుకోలేని భర్త తాతనాయుడు(74) అనారోగ్యంతో మంచంపట్టాడు. మంగళవారం రాత్రి మృతి చెందాడు. ఆయనకు బుధవారం ఉదయం గ్రామంలో కుటుంబ సభ్యు లు అంత్యక్రియలు నిర్వహించారు. కేవలం నాలుగు రోజుల వ్యవధిలోనే భార్యాభర్తలిద్దరూ మృతి చెందడంతో వివాహితులైన ఇద్దరు కుమార్తెలు, కుమారుడు బోరున విలపిస్తున్నారు.


