● సుమారు రూ.12 లక్షల ఆస్తి నష్టం
● అగ్ని ప్రమాదంపై అధికారుల అనుమానం
వీరఘట్టం: మండలంలోని మొట్ట వెంకటాపురం గ్రామంలో కనకల కోటీశ్వరరావుకు చెందిన స్క్రాప్ దుకాణంలో మంగళవారం అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. పెద్ద ఎత్తున అగ్ని కీలలు ఎగిసిపడడంతో గ్రామస్తులు భయాందోళన చెందారు. ప్రమాద విషయం తెలిసిన వెంటనే పాలకొండ అగ్నిమాపాకాధికారి జామి సర్వేశ్వరరావు సంఘటనా స్థలానికి తమ సిబ్బందితో వచ్చి మంటలను అదుపు చేశారు. ప్లాస్టిక్ వ్యర్ధాలు కావడంతో మంటలను అదుపు చేసేందుకు చాలా సమయం పట్టిందని అగ్నిమాపకాధికారి తెలిపారు. ఈ ప్రమాదంలో సుమారు 50 టన్నుల ప్లాస్టిక్ వ్యర్ధాలు కాలిపోయాయని, వీటి విలువ సుమారుగా రూ.12 లక్షల వరకు ఉంటుందన్నారు. ప్రమాదం ఎలా జరిగిందో తెలియలేదని బాధితుడు తెలిపారు. బుధవారం ఎస్.ఐ ఎస్.షణ్ముఖరావు తమ సిబ్బందితో కలసి సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. ఎవరైనా గిట్టనివారు నిప్పుపెట్టారా.. లేక ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం జరిగిందా.. అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్.ఐ తెలిపారు.


