విజయనగరం: తెలంగాణ రాష్ట్రం గద్వాల్ జిల్లా బృందావన్ గార్డెన్లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఓపెన్ నేషనల్ తైక్వాండో చాంపియన్షిప్లో విజయనగరం జిల్లా క్రీడాకారులు అద్భుత ప్రతిభ కనబరిచి పతకాల పంట పండించారు. మే 15 నుంచి మూడు రోజుల పాటు జరిగిన జాతీయ స్థాయి పోటీలలో జిల్లా జట్టు తమ మేటి నైపుణ్యంతో ఏకంగా 16 బంగారు, 9 వెండి, 1 కాంస్య పతకాలను కై వసం చేసుకుని సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ పోటీల్లో ఎన్.హర్షిణి, టి.నాగసాయి జతిన్, వై.ముకేష్ విశ్వనాథ్, వి.రోహిణి సత్య అసాధారణ ప్రతిభ కనబరిచి తలో రెండు గోల్డ్ మెడల్స్ సాధించారు. అలాగే డి.ప్రియవల్లి, డి.కార్తికేయ, ఎస్.గగన్, ఆర్.పూర్ణచంద్రు, వై.చరిష్మా, టి.సంకీర్తన, ఎస్.సాత్విక్, డి.ధనీష్ ఒక్కో బంగారు పతకాన్ని సాధించి జిల్లా కీర్తిని జాతీయ స్థాయిలో చాటారు. ఎం.భావ్యశ్రీ, పి.సహస్ర సమ్హిత, డి.ప్రియవల్లి, ఎ.ముకేష్ మనికంఠ, టి.మేఘనశ్రీ,, ఆర్.తేజశ్రీ, జి.ఫలక్కుమార్, జి.తరుణ్, డి.ధనీష్ తమ ప్రతిభతో రజత పతకాలను సొంతం చేసుకోగా, కాంస్య (బ్రోంజ్) పతకాన్ని ఎస్.సాత్విక్ సాధించారు. జాతీయ స్థాయిలో విజయనగరం పేరును మారుమోగించిన క్రీడాకారులను విజయనగరం జిల్లా తైక్వాండో అసోసియేషన్ అధ్యక్షుడు గురాన అయ్యలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తైక్వాండో అసోసియేషన్ కార్యదర్శి సిహెచ్.వేణుగోపాలరావు ప్రత్యేకంగా అభినందించారు. క్రీడాకారులను ఇంతటి ఉన్నత స్థాయికి తీర్చిదిద్దిన కోచ్లు యశస్విని, చైతన్యల కృషిని వారు కొనియాడారు. విజేతలైన క్రీడాకారులు భవిష్యత్తులో మరిన్ని అంతర్జాతీయ విజయాలు సాధించి, దేశానికి కీర్తి తీసుకురావాలని వారు ఆకాంక్షించారు.
16 గోల్డ్ మెడల్స్తో ఘన విజయం


