జియ్యమ్మవలస రూరల్: మండలంలోని చినమేరంగి ప్రధానవీధిలో సోమవారం రాత్రి సుమారు 11.30 గంటలకు జరిగిన అగ్ని ప్రమాదంలో నాలుగు పూరిళ్లు దగ్ధమయ్యాయి. ఇందులో బెలగాపు శంకర్రావు, పంట్ల కేశవ, కరణం లక్ష్మి, వేమకోట గౌరమ్మ తదితరుల నాలుగు పూరిళ్లతో పాటు కునుకు సన్యాసి అనే రైతు గొర్రెల శాల పూర్తిగా కాలి బూడిదైంది. ఇందులో కరణం లక్ష్మి వస్తువులన్నీ కాలి పోవడంతో ఆమెకు ఆశ్రయం కరువైంది. రాత్రి సుమారు 11.30 గంటల సమయంలో జరిగిన ఈ ప్రమాదాన్ని గమనించిన స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. అనంతరం పార్వతీపురం అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇవ్వడంతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఆస్తి నష్టాన్ని అంచనా వేస్తున్నట్లు రెవెన్యూ అధికారులు మంగళవారం తెలిపారు
జామి: మండల కేంద్రంలో సోమవారం అర్థరాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో పూరిల్లు, 3 బైకులు దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంపై స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..స్థానిక ఎస్సీ కాలనీలో సోమవారం అర్ధరాత్రి జామి సూరప్పడు ఇంటికి నిప్పంటుకుని ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈప్రమాదంలో పూరిపాక, ఇంట్లో ఉన్న వస్తువులు, ఇంటికి సమీపంలో చుట్టుపక్కల ఉన్న వారి బైకులు దగ్ధమయ్యాయి. ఆ సమయంలో వేసవి కావడంతో సూరప్పుడు ఇంటి బయట పడుకోవడంతో స్థానికులతో కలిసి మంటలు ఆర్పే ప్రయత్నం చేశాడు. అప్పటికే పూర్తిగా పూరిల్లు, బైక్లు దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో సుమారు రూ. 5లక్షలు ఆస్తి నష్టం సంభవించింది. సమాచారం మేరకు డీటీ మూర్తి, రెవెన్యూ సిబ్బంది మంగళవారం ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు అడిగి తెలుసుకున్నారు. తక్షణ సాయం కింద బాధిత కుటుంబానికి 26 కిలోల బియ్యం, రూ.7600 నగదు, బట్టలు అందించారు.


