మక్కువ: బంగారానికి మెరుగు పెడతామంటూ ఇద్దరు మహిళల మెడల్లోని పుస్తెలతాళ్లను తెంచుకుపోయేందుకు చైన్స్నాచర్స్ విఫల యత్నం చేశారు. మక్కువ మండలం దబ్బగడ్డ గ్రామంలో సోమవారం ఈ ఘటన జరిగింది. దీనిపై గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం బంగారు ఆభరణాలకు మెరుగు పెడతామంటూ ఇద్దరు యువకులు ద్విచక్ర వాహనంపై దబ్బగడ్డ గ్రామానికి చేరుకున్నారు. గ్రామంలోని ఓ ఇద్దరు మహిళలను టార్గెట్ చేశారు. ఎగువ వీధికి చెందిన వీరపిండి.రాజేశ్వరి, గంటా.రాములమ్మ అనే మహిళల మెడలో పుస్తెల తాళ్లను తెంచేందుకు ప్రయత్నించారు. దీంతో ఆ ఇద్దరు మహిళలు గట్టిగా కేకలు వేయడంతో పక్క ఇంట్లో నివాసం ఉంటున్న మరో మహిళ వచ్చి సెల్ఫోన్లో ఫొటోలు తీస్తుండగా పుస్తెల తాళ్లతో పాటు, వెంట తెచ్చుకున్న బ్యాగును వదిలేసి చైన్ స్నాచర్స్ పరారయ్యారు. పుస్తెలతాళ్లు ముక్కలయ్యాయని, తమపై మత్తు మందు జల్లారని, యువకులు తెలంగాణ యాసలో మాట్లాడుతున్నారని మక్కువ పోలీస్ స్టేషన్లో బాధిత మహిళలు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.


