● రెవెన్యూ, పరిపాలనాంశాలపై ఆరా
డెంకాడ: మండలంలోని డెంకాడ స్వర్ణ గ్రామాన్ని (సచివాలయం) కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి గురువారం సందర్శించారు. ముందుగా రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులు, పరిపాలన అంశాలపై ఆరా తీశారు. ప్రధానంగా ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలైన జనగణన ప్రక్రియ, భూముల రీ–సర్వే పురోగతి, మ్యుటేషన్ (భూ మార్పిడి) దరఖాస్తుల పరిష్కారం వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. రికార్డుల నిర్వహణలో ఎటువంటి జాప్యం ఉండకూడదని, ప్రజల నుంచి వచ్చే దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం గ్రామ సచివాలయం, పరిసర ప్రాంతాలను పరిశీలించిన కలెక్టర్.. కార్యాలయ ప్రాంగణాన్ని, గ్రామ వీధులను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సిబ్బందికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా పనిచేయాలని ఆయన సూచించారు. కలెక్టర్ వెంట పలువురు రెవెన్యూ అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.


