న్యూస్రీల్
రహదారులపై మృత్యుఘోష మందేసి వాహనం ఎక్కి..మృత్యుఒడిలోకి జిల్లాలో ఆందోళనకరంగా ’మత్తు’ కేసులు ఏటా పెరుగుతున్న మరణాల గణాంకాలు
నిఘా నేత్రం.. తనిఖీలు ముమ్మరం
పార్వతీపురం రూరల్:
పచ్చని సంసారాల్లో మద్యం మత్తు చిచ్చు రేపుతోంది. రహదారులు రక్తదారులవుతున్నాయి. కన్నవారి కలలు ఒక్క ’చుక్క’ మత్తులో చిత్తవుతున్నాయి. జిల్లాలో రోడ్డు ప్రమాదాల తీరును గమనిస్తే, సగానికి పైగా మత్తువల్లే జరుగుతున్నాయని పోలీసుల విచారణలో తేలడం గమనార్హం. గుమ్మలక్ష్మీపురంలో లారీని ఢీకొన్న యువకుడి ఉదంతమైనా, సీతానగరం వద్ద సైకిలిస్ట్ను బైక్తో ఢీకొట్టిన ఘటనైనా.. వెనుక ఉన్నది మద్యం మహమ్మారేనని స్పష్టమవుతోంది. మత్తులో తూలుతూ డ్రైవింగ్ చేయడం అంటే మృత్యువుకు ఆహ్వానం పలకడమేనని గణాంకాలు హెచ్చరిస్తున్నాయి.
పెరుగుతున్న కేసులు..తరుగుతున్న ప్రాణాలు
జిల్లాలో డ్రంకెన్ డ్రైవ్ కేసులు ఏటా పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. 2023లో 3,165 కేసులు నమోదు కాగా, 2025 నాటికి ఆ సంఖ్య 3,456కు చేరడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. కేవలం మద్యం తాగి వాహనం నడపడమే కాకుండా, బహిరంగ మద్యపానం (ఓపెన్ డ్రింకింగ్) కేసులు సైతం వేల సంఖ్యలో నమోదవుతున్నాయి. 2025లో జరిగిన 256 ప్రమాదాల్లో ఏకంగా 107 మంది ప్రాణాలు కోల్పోవడం అత్యంత విషాదకరం. మృతుల సంఖ్య 2024తో (71 మంది) పోలిస్తే 2025లో భారీగా పెరగడం గమనార్హం.
శిక్షలు ఖరారు.. జైలు గ్యారంటీ
మందుబాబుల ఆట కట్టించేందుకు ప్రభుత్వం చట్టాలను మరింత కఠినతరం చేసింది. మద్యం తాగి వాహనం నడిపి మొదటిసారి దొరికితే రూ.10 వేలు జరిమానా విధిస్తారు. రెండోసారి దొరికితే జైలు శిక్ష తప్పదు. ఒకవేళ ప్రమాదానికి కారణమై ఎవరైనా మరణిస్తే..ఆరు నెలల నుంచి మూడేళ్ల వరకు జైలు శిక్షతో పాటు లైసెనన్స్ రద్దు వంటి కఠిన చర్యలు ఉంటాయి. కేవలం మద్యం మాత్రమే
కాదు. హెల్మెట్ పెట్టకున్నా, సీటు బెల్టు ధరించకపోయినా రూ.1,000 జరిమానా, లైసెన్స్ లేకపోతే రూ.5,000 వరకు వడ్డింపు తప్పదు. అవసరమైతే వాహనాలను సీజ్ చేసేందుకు కూడా వెనుకాడబోమని చట్టం చెబుతోంది.
ప్రమాదాల నివారణకు జిల్లా పోలీసు యంత్రాంగం పటిష్ట చర్యలు చేపట్టింది. ఈ మేరకు తనిఖీలు ముమ్మరం చేశాం. ప్రతి ప్రాణం విలువైనదే.. మద్యం తాగి వాహనం నడపడం ద్వారా మీ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను పణంగా పెట్టవద్దు. కేవలం జరిమానాలు విధించడమే లక్ష్యం కాదు, ప్రజల్లో మార్పు రావడమే ప్రధాన ఉద్దేశం చట్టం తన పని తాను చేస్తున్నా, వాహనదారుల్లో బాధ్యత పెరగాలి. మత్తు వదిలి..బాధ్యతగా వాహనం నడపడమే కుటుంబానికి రక్ష. –ఎస్పీ ఎస్వీ మాధవ్ రెడ్డి


