● రోడ్డు లేదు.. తాగునీటికి కటకట ● గిరిజనుల దుర్భర జీవనం ● అత్యవసర వేళ తప్పని డోలీమోతలు
పార్వతీపురం:
కురుపాం మండలంలోని తిత్తిరి పంచాయతీ పరిధిలోని బొడ్డమాను గూడ గ్రామంలో కనీస వసతులు కరువయ్యాయి. రోడ్డు, తాగునీరు సదుపాయం లేక గిరిజనులు దుర్భర జీవనాన్ని సాగిస్తున్నారు. గ్రామంలో సుమారు 60 మంది గిరిజనులు నివసిస్తున్నారు. నీలకంఠాపురం నుంచి జరడ గ్రామం మీదుగా సుమారు 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రామానికి వెళ్లాలంటే కాలినడకే ఆధారం. మట్టి దారులు, కొండ చరియలు దాటి గ్రామానికి చేరుకోవాలి. వర్షాకాలంలో పరిస్థితి మరింత దారుణం. అత్యవసర సమయాల్లో ఆస్పత్రులకు డోలీలోనే రోగులను తరలించాల్సిన పరిస్థితి. గ్రామంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. గ్రామస్తులు సమీపంలో కొండపక్కన ఏర్పాటు చేసుకున్న గుమ్మి(గుంట) నుంచి వచ్చే నీటిని తాగునీటిగా, వాడుక నీటిగా వినియోగిస్తున్నా రు. ఆ నీరు కలుషితమైనది కావడంతో తరచూ రోగాలబారిన పడుతున్నారు. జిల్లా అధికారులు స్పందించి బొడ్డమానుగూడ గ్రామానికి రోడ్డు నిర్మించి తాగునీటి సౌకర్యం కల్పించాలని గిరిజనులు కోరుతున్నారు.


