పీఎం పాలెం
(విశాఖ): అజాగ్రత్తగా ఆర్టీసీ బస్సు దిగిన వ్యకి ఆదే బస్సు చక్రాల కిందపడి మరణించాడు. మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో మధురవాడ బస్టాప్లో ఈ ప్రమాదం జరిగింది. ఈ సంఘటనకు సంబంధించి సీఐ బాలకృష్ణ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. విజయనగరం జిల్లా రామభద్రపురం మండలం చౌదంతివలస గ్రామానికి చెందిన చీమల సింహాచలం(51) నగరానికి వలస వచ్చి కూలిపనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. భార్య గంగమ్మతో స్థానికంగా ఓ భవనంలో వాచ్మన్గా పనిచేస్తున్నాడు. ఇదిలా ఉండగా ఈ నెల 11న పండుగ నిమిత్తం భార్యాభర్తలు స్వగ్రామం వెళ్లారు. తిరుగు ప్రయాణంలో మంగళవారం రాత్రి విజయనగరంలో మెట్రో బస్సు ఎక్కారు. మధురవాడ బస్టాప్లో సింహాచలం అజాగ్రత్తగా బస్సు దిగుతూ కింద పడిపోయాడు. అది గమనించని ఆర్టీసీ బస్సు డ్రైవర్ ముందుకు వెళ్లడంతో వెనుక చక్రాల కిందపడి సింహాచలం అక్కడికక్కడే మరణించాడు. మృతదేహాన్ని పోస్ట్మార్టంనిమిత్తం కేజీహెచ్కు తరలించి మృతుడి భార్య గంగమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్్ుట్ల సీఐ బాలకృష్ణ తెలిపారు.
పురుగు మందు తాగి వ్యక్తి ఆత్మహత్య
నెల్లిమర్ల రూరల్: మండలంలోని ఒమ్మి గ్రామంలో పురుగు మందు తాగి ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై ఎస్సై గణేష్, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన అంబళ్ల మణికంఠ(36) ఈ నెల 11న అర్ధరాత్రి పురుగు మందు తాగేశాడు. స్థానికులు గమనించి చికిత్స నిమిత్తం విజయనగరం ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున మృతిచెందాడు. మృతుడికి భార్యతో పాటు ఇద్దరు చిన్న ఆడపిల్లలు ఉన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై గణేష్ తెలిపారు.


