పార్వతీపురం: జిల్లాలో ఖరీఫ్ మాదిరిగానే రబీ లో సాగుచేసిన పంటలకు సాగునీరు అందించేందుకు ఆలోచన చేస్తున్నట్టు కలెక్టర్ డాక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డి తెలిపారు. జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల ఆధునికీకరణ, కాలువల బలోపేతం, నీటి వినియోగ సామర్థ్యంపై అధికారులతో కలెక్టర్ బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. అధికారులు పాతపద్ధతుల్లో కాకుండా కొత్త ఆలోచనలతో ప్రాజెక్టుల నిర్వహణ చేపట్టాలన్నారు. కమాండ్ ఏరియా డెవలప్మెంట్ కింద కాలువలను బలోపేతం చేయాలన్నారు. సాగునీటి వనరులను మెరుగుపరచడం ద్వారా జిల్లాలోని రైతులకు మరింత ప్రయోజనం చేకూరేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్కుమార్రెడ్డి మాట్లాడుతూ చెరువుల దగ్గర ఉన్న ఆక్రమణలను తొలగించేందుకు ఇంజినీరింగ్ అధికారులకు పూర్తి అధికారాలున్నాయన్నారు. రికార్డుల్లో ఇరిగేషన్ అని ఉంటే ఆ భూమిని పరిరక్షించాల్సిన బాధ్యత ఇరిగేషన్ అధికారులదేనన్నారు. రాను న్న ఖరీఫ్లోగా చెరువుల ఆక్రమణలను పూర్తిగా తొలగించాలని ఆదేశించారు.
శత శాతం పన్ను వసూళ్లకు స్పెషల్ డ్రైవ్
విజయనగరం: 2025–26 ఆర్థిక సంవత్సరం ముగింపు దశకు చేరుకోవడంతో నగరంలో ప్రముఖ విద్యా, వ్యాపార సంస్థలు పన్ను బకాయిలను పెద్ద మొత్తంలో చెల్లిస్తున్నారు. అందరి సమిష్టి కృషితో శతశాతం పన్ను వసూళ్లే లక్ష్యంగా కమిషనర్ బాలస్వామి ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు సహాయ కమిషనర్ కిల్లాన అప్పలరాజు పన్ను వసూళ్ల ప్రక్రియను చేపడుతున్నారు. రెవెన్యూ సిబ్బంది, కార్యదర్శులతో టీములుగా ఏర్పడి నగర వ్యాప్తంగా బకాయి ఉన్న పన్నులు రాబడుతున్నారు. కొన్ని సంస్థలు లక్షల రూపాయల బకాయిలు ఉండటంతో వాటిని తక్షణమే చెల్లించాలని రెవెన్యూ అధికారులు పట్టుబడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వడ్డీ రాయితీ 50 శాతం ప్రకటించడంతో ఈ వెసులుబాటును సద్వినియోగం చేసుకోవాలని అధికారులు పిలుపునిచ్చారు.


