కూటమి ప్రభుత్వం గాడిదలు కాస్తోందా?
చీపురుపల్లి: రైల్వే ఓవర్ బ్రిడ్జి(ఆర్ఓబీ) పనులు పూర్తి చేయడంలో పద్దెనిమిది నెలలుగా కూటమి ప్రభుత్వం గాడిదలు కాస్తోందా? తమ ప్రభుత్వ హయాంలో నిధులు మంజూరు చేయించి పనులు ప్రారంభించి 75 శాతం పనులు పూర్తి చేస్తే కేవలం 25 శాతం మిగులు పనులను ఎందుకు చేయించలేకపోయిందో చెప్పాలని మాజీ ఎంపీ, వైఎస్సార్సిపి పీఏసీ మెంబర్ బెల్లాన చంద్రశేఖర్ ప్రశ్నించారు. ఈ మేరకు పట్టణంలోని రాజాం రోడ్డులో గల ఆర్ఓబీని స్థానిక వైఎస్సార్సీపీ నాయకులతో కలిసి ఆదివారం సందర్శించిన ఆయన అక్కడే ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రైల్వే ఓవర్ బ్రిడ్జి(ఆర్ఓబీ)పై కొద్ది రోజులుగా కూటమి నేతలు చేస్తున్న ప్రచారం చూస్తుంటే వారికి సిగ్గు వేయడం లేదా అని ఎద్దేవా చేశారు. ఇదే ఆర్ఓబీకి సంబంధించి రిక్షాకాలనీ వాసులకు సర్వీసు రోడ్డు సమస్య తలెత్తితే ఒక్క కూటమి నాయకుడూ పద్దెనిమిది నెలలుగా కనిపించకుండా ముఖం చాటేసి ఇప్పుడు ఆర్ఓబీ ప్రారంభించే సమయానికి అంతా తామే చేశామన్నట్లు ఫొటోలు, వీడియోలు తీసుకుని సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారన్నారు. రైల్వేస్టేషన్ అభివృద్ధిపై కూటమి నాయకులకు చిత్తశుద్ధి ఉంటే బహిరంగ ప్రజా వేదికకు రావాలని సవాల్ విసిరారు.
నా హయాంలో నిధుల మంజూరు
రైల్వేస్టేషన్ అభివృద్ధి ఎవరి హయాంలో ఎంతెంత జరిగిందో ప్రజావేదికలోనే తేల్చుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. చీపురుపల్లిలో ఆర్ఓబీ నిర్మాణానికి నిధుల మంజూరు కోసం తాను ఎంపీగా ఉన్నప్పుడు అప్పటి రైల్వే మంత్రులు పీయూష్ గోయల్, అశ్వనీ వైష్టవ్లు దగ్గరకు పలుమార్లు వెళ్లి 2022 ఆగస్టు 22న రూ.12.99 కోట్లు నిధులు మంజూరు చేయించానని తెలిపారు. బొత్స ఝాన్సీ ఎంపీగా ఉన్నప్పుడు రూ.50 లక్షలతో చీపురుపల్లి రైల్వేస్టేషన్ అభివృద్ధి చేసిన విషయాన్ని గుర్తు చేసుకోవాలని హితవు పలికారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఇప్పిలి అనంతం, జిల్లా ప్రచార విభాగం అధ్యక్షుడు వలిరెడ్డి శ్రీనివాసనాయుడు, పార్టీ మండల అధ్యక్షుడు మీసాల వరహాలనాయుడు, నియోజకవర్గం యువజన విభాగం అధ్యక్షుడు బెల్లాన వంశీకృష్ణ, జిల్లా బీసీ విభాగం ఉపాధక్షుడు బెల్లాన త్రినాథరావు, పార్టీ నాయకులు కొసిరెడ్డి రమణ, ఇప్పిలి తిరుమల, గవిడి సురేష్, కరణం ఆది, రేవళ్ల సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు.
క్రెడిట్ చోరీతో 18 నెలలుగా ప్రజలను మభ్యపెడుతున్నారు
వైఎస్సార్సీపీ హయాంలోనే ఆర్ఓబీ నిర్మాణానికి నిధులు
రైల్వేస్టేషన్ అభివృద్ధిపై టీడీపీ బహిరంగ చర్చకు సిద్ధమా?
మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్
కూటమి ప్రభుత్వం గాడిదలు కాస్తోందా?


