
గర్జించిన గిరిజనం
● సమస్యలు పరిష్కరించాలంటూ శాంతియుత ర్యాలీ ● ఐటీడీఏ వద్ద బైఠాయింపు
సీతంపేట: గిరిజన సమస్యలు పరిష్కరించాలంటూ ఆదివాసీ సంఘాల ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో గిరిజనులు నినదించారు. హక్కులు రక్షించాలంటూ ఆందోళన చేశారు. సోమవారం తలపెట్టిన చలో సీతంపేట కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ముందుగా సీతంపేట వారపుసంత నుంచి ఐటీడీఏ వరకు శాంతియుత ర్యాలీ నిర్వహించారు. బస్టాండ్ వద్ద మానవహారంగా ఏర్పడ్డారు. ఐటీడీఏ ముఖద్వారం వద్ద బైఠాయించారు. సమస్యలు చెప్పాలని ఐటీడీఏ ఏపీఓ చిన్నబాబు గిరిజనులు ధర్నా చేస్తున్న వేదిక వద్దకు వచ్చారు. ఐటీడీఏ పీఓ రావాలని, మా సమస్యలు వినాలని పట్టుబట్టారు. పీఓ పార్వతీపురం వెళ్లారని, ఫోన్లో మాట్లాడాలని మొబైల్ ఇచ్చినా ఆదివాసీ సంఘాల నాయకులు తిరస్కరించారు. పీఓ ఎప్పుడు వచ్చినా పరవాలేదని రోజంతా ఇక్కడే కూర్చుంటామని పట్టుబట్టారు. పీఓ మధ్యాహ్నానికి వస్తారని, అప్పుడు కొంతమంది కలిసి సమస్యలు చెప్పాలని పాలకొండ సీఐ ప్రసాదరావు, ఎస్ఐ వై.అమ్మన్నరావు సర్దిచెప్పారు. గిరిజన సంఘాల జేఏసీ అధ్యక్షుడు బి.శ్రీనివాసరావు మాట్లాడుతూ ఐటీడీఏ, గురుకులం బైలా ప్రకారం ఉపాధ్యాయ, ఉద్యోగ నియామకాలు, బదిలీలు చేపట్టాలన్నారు. మెగా డీఎస్సీ నుంచి గిరిజన సంక్షేమ శాఖ ఉపాధ్యాయ పోస్టులు మినహాయించాలన్నారు. ఐదో షెడ్యూల్ ఏరియాలో నివసిస్తున్న ఆదివాసీల సర్వహక్కులు రక్షించాలని డిమాండ్ చేశారు. సీతంపేట ఐటీడీఏను సీతంపేటలోనే కొనసాగించాలన్నారు. పూర్తిస్థాయి పీఓను నియమించాలన్నారు. షెడ్యూల్ ప్రాంతంలో వంద శాతం ఉద్యోగ కల్పనపై నాలుగు ఉమ్మడి జిల్లాల్లో ప్రజాభిప్రాయ సేకరణ చేసినట్టుగా స్థానిక ఐటీడీఏలో కూడా వర్క్షాప్ ఏర్పాటు చేయాలన్నారు. 1/70, పెసా, అట్రాసిటీ చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని కోరారు. ప్రతీ మండల కేంద్రంలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని నిర్మించాలని డిమాండ్ చేశారు. షెడ్యూల్ ప్రాంత చట్టాలు, ఆదివాసీ వీరుల చరిత్రను పాఠ్యపుస్తకాలలో చేర్చాలన్నారు. అనంతరం పాలకొండ సబ్కలెక్టర్, ఐటీడీఏ ఇన్చార్జి పీఓ పవార్ స్వప్నిల్ జగన్నాథ్ను కలిసి పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ బి.ఆదినారాయణ, గిరిజన సంఘాల జేఏసీ నాయకులు రవి, సవర చిరంజీవి, బి.ఉమామహేశ్వరరావు, బి.రామ్మోహన్రావు, బి.దమయంతినాయుడు, ఎస్.సాయికుమార్, కె.భాస్కరరావు, పి.పురుషోత్తం, ఎన్.కాంతారావు, బి.ఆదిలక్ష్మి, కె.వెంకునాయుడు, తదితరులు పాల్గొన్నారు.

గర్జించిన గిరిజనం