డీఈఓ రామారావు
నరసరావుపేట ఈస్ట్: పర్యావరణ పరిరక్షణలో విద్యార్థులను భాగస్వాములను చేస్తూ ప్రతి పాఠశాలలో ఎకో క్లబ్లను ఏర్పాటు చేయాలని జిల్లా విద్యాశాఖాధికారి పీవీజే రామారావు సూచించారు. బుధవారం మున్సిపల్ ఉన్నత పాఠశాలలో పాఠశాలల్లో నేషనల్ గ్రీన్ కార్ప్స్, ఎకో క్లబ్ల ఏర్పాటుపై అవగాహన సమావేశం నిర్వహించారు. డీఈఓ మాట్లాడుతూ విద్యార్థులలో పర్యావరణ పరిరక్షణ, జీవవైవిధ్య సంరక్షణ, మొక్కల పెంపకం, నీరు, విద్యుత్ పొదుపు, వ్యర్థాల నిర్వహణ వంటి అంశాలపై పూర్తిస్థాయి అవగాహన కల్పించాలని సూచించారు. నేషనల్ గ్రీన్ కార్ప్స్ జిల్లా సమన్వయకర్త షేక్ ఆయేషా సుల్తానా మాట్లాడుతూ, పాఠశాలల్లో ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించటం, విత్తన బంతుల తయారీ, మిల్లెట్ లడ్డూ, హెర్బల్ పళ్లపొడి వంటి అంశాలపై వర్క్షాప్లు నిర్వహించాలని సూచించారు. పరిసరాల పరిశుభ్రత, మొక్కల పెంపకం, తడి–పొడి వ్యర్థాలను వేరు చేయటం వంటి కార్యక్రమాలను చేపట్టాలని కోరారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన పర్యావరణ హిత వస్తువుల ప్రదర్శన ఆకట్టుకుంది. ఓజోన్ ప్రాధాన్యతను వివరిస్తూ విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి రాజశేఖర్, మాజీ అధికారి ఏఏ మధుకుమార్ పాల్గొన్నారు.


