నెహ్రూనగర్: నగరంలో వినాయక చవితి వేడుకలను వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు, పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త అంబటి రాంబాబు, నగర అధ్యక్షురాలు, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త షేక్ నూరి ఫాతిమా, తూర్పు నియోజకవర్గ పరిశీలకులు నిమ్మకాయల రాజనారాయణ ప్రత్యేక పూజలు చేశారు. వైఎస్సార్సీపీ ట్రేడ్ యూనియన్న్ అధ్యక్షుడు శేషగిరి పవన్కుమార్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక పందిరితో పాటు, 4వ డివిజన్న్లో కన్నా యూత్ ఆధ్వర్యంలో కొలువుదీరిన గణనాథుడిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని స్వామివారిని వేడుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో ప్రతి ఇంటా సంతోషాలు వెల్లివిరియాలని, రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పార్టీ స్థానిక కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
పూజల్లో పాల్గొన్న అంబటి రాంబాబు, నూరి ఫాతిమా


