డీఈఓ పీవీజే రామారావు
యడ్లపాడు: మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు వంద శాతం నమోదు లక్ష్యంగా ఉపాధ్యాయులు పనిచేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి పీవీజే రామారావు అన్నారు. సోమవారం యడ్లపాడు మండల విద్యా వనరుల కేంద్రాన్ని ఆయన సందర్శించారు. ఎంఈఓ ఎంవీ నాగరత్నం సిబ్బంది, సీఆర్పీలు, పీటీఐలు, ఐఈఆర్పీలతో సమీక్ష నిర్వహించారు. డీఈవో మాట్లాడుతూ యూ–డైస్ పోర్టల్లో ఇంకా నమోదు కాని పిల్లల వివరాలను తక్షణమే సేకరించి, ఆ ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. ఒకటవ తరగతిలో చేరాల్సిన పిల్లల గుర్తింపు, ప్రాథమిక పాఠశాల నుంచి ఉన్నత పాఠశాలకు వెళ్లే విద్యార్థుల వివరాలపై క్షేత్రస్థాయిలో నివేదికలు సిద్ధం చేయాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో అందుబాటులో ఉన్న అత్యాధునిక వసతులు, విద్యా కానుక వంటి పథకాలపై గ్రామీణ ప్రాంత తల్లిదండ్రులకు అవగాహన కల్పించి, విద్యార్థుల హాజరు శాతం పెంచేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఏ ఒక్క విద్యార్థి విద్యా సంవత్సరానికి దూరం కాకూడదనే లక్ష్యంతో పనిచేయాలని, ఇందులో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని సిబ్బందిని హెచ్చరించారు.


