పాలువాయిలో విషాదం
రెంటచింతల: మా ఇంటి దీపాలు ఆరిపోయాయి...మేం ఎవరి కోసం బతకాలి అంటూ ఆ కన్నతల్లులు గురజాల ప్రభుత్వ ఆస్పత్రి వద్ద రోధిస్తున్న తీరు అక్కడినున్న వారిని కంటితడి పెట్టించింది. మృతి చెందిన బంగారి, భాస్కర్లు వరుసకు అన్నదమ్ములు. వెంకయ్య వారికి వరసకు బావమరిది. ముగ్గురూ వ్యవసాయ కూలీ పనులకు వెళ్తుంటారని వారి బంధువులు తెలిపారు. కోటేశ్వరరావు, శ్రీనివాసరావు కుటుంబాలకు ఒక్కొక్కరే కుమారులు. వీరు ఈ రోడ్డు ప్రమాదంలో మృతిచెందడంతో ‘మేం ఏ పాపం చేశామయ్యా... 20 సంవత్సరాలుగా మా కంటి పాపలా చూసుకుంటే ఎదిగిన కుమారులు మా కళ్లముందు రక్తపు మడుగులో పడిపోయారు... దేవుడు మాకు ఎందుకు ఈ శిక్ష వేశాడు...’ అంటూ కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న తీరుకు అక్కడివారు చలించిపోయారు. రోడ్డు ప్రమాదంలో గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు చనిపోవడంతోపాటు మరో యువకుడు మృత్యువుతో పోరాడుతుండటంతో పాలువాయి గ్రామంలో తీవ్ర విషాదం అలుముకుంది. చూపరులు సైతం కంటతడి పెట్టుకున్నారు.


