రీ సర్వేతో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం
ఇంకొల్లు(చినగంజాం): రీ సర్వేతో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం అని రాష్ట్ర సర్వే, సెటిల్మెంట్, ల్యాండ్ రికార్డ్స్ డైరక్టర్ రోణంకి కూర్మనాథ్ పేర్కొన్నారు. శుక్రవారం కారంచేడు, ఇంకొల్లు మండలాల్లోని గ్రామాలలో గ్రౌండ్ ట్రూతింగ్, క్షేత్రస్థాయిలో రీ సర్వే పనులను ఆయన స్వయంగా పరిశీలించారు. ఆయన అక్కడ ఉన్న రైతులు, రెవెన్యూ సర్వే సిబ్బందితో మాట్లాడారు. డైరెక్టర్ కూర్మనాథ్ మాట్లాడుతూ ప్రజలు, రైతుల సమక్షంలో పనులు చేపట్టి పూర్తి చేస్తేనే అత్యుత్తమ ఫలితాలు వస్తాయని.. భూ రికార్డులు ప్రక్షాళన రైతులకు కచ్చితమైన భూ హక్కులు కల్పించడమే లక్ష్యంగా రాత్రింబవళ్లు శ్రమిస్తున్న రెవెన్యూ సర్వే సిబ్బంది సేవలు అభినందనీయం అని అధికారులను కొనియాడారు. క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న పలు సాంకేతిక భూ సమస్యలపై సుదీర్ఘంగా సమీక్షించారు. రీ సర్వే ప్రక్రియ అత్యంత పారదర్శకంగా సాగుతుందని కారంచేడు, ఇంకొల్లు, చెరువు గ్రామాల్లో డైరెక్టర్ సమక్షంలో సిబ్బంది, రైతుల భూ కమతాలను సర్వే చేసి డేటాను సేకరించారు. కార్యక్రమంలో చీరాల ఆర్డీవో ఎస్ లవన్న, మల్టీ జోన్ 2 ఆర్జేడీ వెంకటేశ్వరరావు, జిల్లా సర్వే సహాయ సంచాలకులు శేషగిరిరావు, జిల్లా సర్వే ఇన్స్పెక్టర్ అల్తాఫ్, కారంచేడు, ఇంకొల్లు తహసీల్దార్ నాగరాజు, శ్రీనివాస్లతో స్థానిక మండల రెవెన్యూ సర్వే సిబ్బంది, అధిక సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.


