పట్నంబజారు: గంజాయి కేసులో నిందితుడిని అరెస్టు చేసి పోలీసులు కోర్టులో హాజరు పరిచారు. కొత్తపేట పోలీసు స్టేషన్లో శుక్రవారం రాత్రి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కొత్తపేట పోలీసు స్టేషన్ సీఐ ఎం.వీరయ్యచౌదరి వివరాలు వెల్లడించారు. కర్ణాటక రాష్ట్రం హవేరి జిల్లా అప్పిఆలూరు గ్రామానికి చెందిన హిరేకాంక్షి నిషార్ అహ్మద్ అలియాస్ ఆరీఫ్ అనే యువకుడు విశాఖపట్నం వెళ్లి ఆరు కిలోల గంజాయి కొనుగోలు చేశాడు.
తిరిగి వస్తూ గుంటూరు రైల్వే స్టేషన్లో ట్రైన్ దిగి కర్ణాటక రాష్ట్రం వెళ్లేందుకు వివరాలు అడుగుతున్న నేపథ్యంలో అనుమానం వచ్చిన పోలీసులు పక్కా సమాచారంతో దాడిచేశారు. నిషార్ అహ్మద్ వద్ద ఆరు కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరుస్తున్నట్లు తెలిపారు.


