రెంటచింతలలో 47.2 డిగ్రీల
అధిక ఉష్ణోగ్రత నమోదు
రెంటచింతల: రెంటచింతలలో గురువారం గరిష్ట ఉష్ణోగ్రత 47.2 డిగ్రీలు నమోదుకావడంతో గ్రామం భగభగ మంటూ మండింది. రెంటచింతల మండలంలోని గోలి, జెట్టిపాలెం, పశర్లపాడు తదితర గ్రామాల పరిధిలో వందల ఎకరాల విస్తీర్ణంలో నల్ల నాపరాయి నిక్షేపాలు అత్యధికంగా ఉండటం కారణంగా ఈ ప్రాంతంలో వేసవిలో ఇక్కడ అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి. కొద్ది రోజులుగా గ్రామంలో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో గ్రామస్తులు అల్లాడుతున్నారు. తీవ్రమైన ఉక్కపోతకు వృద్ధులు, చిన్నారులు, గర్భిణులు అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం 9గంటల తరువాత ఇళ్లలో నుంచి బయటకు రావడంలేదు.


