నరసరావుపేట: ప్లాస్టిక్ రహిత సమాజంతోనే ఆరోగ్యకరమైన భవిష్యత్ లభిస్తుందని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ సంజనా సింహ పేర్కొన్నారు. శనివారం స్వర్ణాంధ్ర–స్వచ్చాంధ్ర కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ కార్యాలయం నుంచి ప్లాస్టిక్ ఫ్రీ స్టేట్ థీమ్ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ ఆర్డీఓ కార్యాలయానికి చేరుకుంది. రెండు కార్యాలయాల వద్ద ఉద్యోగులతో ప్రతిజ్ఞ చేయించారు. మున్సిపల్ కార్యాలయంలో మొక్క నాటి నీరు పోశారు. ఆర్డీఓ కె.బాలకృష్ణ, మున్సిపల్ కమిషనర్ బి.రమ్యకీర్తన, అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.
రెవెన్యూ సమస్యలను పరిష్కరించండి
జిల్లాలో దీర్ఘకాలంగా ఉన్న రెవెన్యూ సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ సంజనా సింహ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ నుంచి నిర్వహించిన టెలీ కాన్ఫెరెన్స్లో మాట్లాడుతూ రెవెన్యూ సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందన్నారు. దీనికోసం అవసరమైన ప్రతిపాదనలు, పరిష్కారాలను రూపొందించాలని సూచించారు. రీసర్వే ప్రక్రియలో తలెత్తుతున్న సాంకేతిక. క్షేత్రస్థాయి సమస్యలు, జాయింట్ ఎల్బీఎం, 22–ఏ, అన్ – సర్వేయిడ్ – అన్ – సెటిల్డ్ గ్రామాలు, ఎస్టేట్, ఈనాం గ్రామాల సమస్యలు, ఈనాం భూములకు సంబంధించి ఉన్న న్యాయపరమైన, రెవెన్యూ చిక్కులు, ఎండీఆర్, వెబ్ ల్యాండ్, అడంగల్ రికార్డులు, వ్యవసాయ సాగు పట్టాలు, ఇళ్ల పట్టాలు, టైటిల్ డీడ్లు తదితర అంశాలపై చర్చించారు. క్షేత్రస్థాయిలో ప్రతి సమస్యను నిశితంగా పరిశీలించి, పరిష్కారానికి సమగ్ర నివేదికలను రూపొందించాల్సి ఉందని పేర్కొన్నారు. వాటి పరిష్కార దిశగా కృషి చేయాలన్నారు.


