అచ్చంపేట: డప్పు కళాకారులంకు ప్రభుత్వం పింఛన్లు మంజూరు చేయాలని ఆంధ్రప్రదేశ్ చర్మకారుల సేవా సంఘం రాష్ట్ర కార్యదర్శి గార్లపాటి దాసు డిమాండ్ చేశారు. రాష్ట్ర అధ్యక్షుడు బుల్ల రాజారావు పిలుపు మేరకు శనివారం మండలంలోని చిగురుపాడు ఎస్సీ కాలనీలో పర్యటించారు. ఆయన మాట్లాడుతూ డప్పు కళాకారులంతా పనులులేక దయనీయ స్థితిలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 40 ఏళ్లు నిండిన వారందరికి పింఛన్లు మంజూరు చేయాలని, నివేశన స్థలాలు లేనివారికి రెండు సెంట్లు స్థలాలు ఇచ్చి ప్రభుత్వమే పక్కా ఇల్లు కట్టించాలని కోరారు. రాష్ట్ర సాంస్కృతిక శాఖ నుంచి డప్పు కళాకారులకు ఐడీ కార్డులు మంజూరు చేసి ఆర్టీసీ బస్సులలో రాయితీలు, సంక్షేమ పథకాలలో ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. గ్రామ సచివాలయాలలో దండోరా ఉద్యోగం ఇవ్వాలని విన్నవించారు. చిన్న, మధ్య తరహా వ్యాపారాలు స్థాపించి, ఆదాయ వనరులను పెంపొందించుకునేందుకు ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి రెండు లక్షల వరకు సబ్సిడీ రుణాలు మంజూరు చేయాలన్నారు. కార్యక్రమంలో పల్నాడు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ చిలకా భాస్కరరావు, వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ శిఖా తిమోతి, ఎస్సీ సెల్ నియోజకవర్గ కన్వీనర్ తుడుం ఇమ్మానియోలు, మండల కార్యదర్శి తాళ్లూరి సైదులు పాల్గొన్నారు.


