గర్భిణులు ఎదుర్కొంటున్న సమస్యలపై అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. రక్త, మూత్ర పరీక్షల కేంద్రంలో కనీస సౌకర్యాలు లేక కొన్నేళ్లుగా ఇక్కట్లకు గురవుతున్నారు. వస్తున్న వారికి సరిపడా సిబ్బంది లేకపోవటంతో పరీక్షల ప్రక్రియ నత్తనడకగా సాగుతోంది. సిబ్బందిని పెంచాల్సి ఉన్నా అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోవటం లేదు. పరీక్షల కోసం గంటల సమయం పడుతోంది. రిపోర్టులు చేతికి అందటానికి అదనంగా మరో రెండు గంటలు వేచి ఉండక తప్పని పరిస్థితి నెలకొంది. ఉదయం పరీక్షలు చేయించిన వారికి మధ్యాహ్నం రిపోర్టులు అందుతున్నాయి. మధ్యాహ్నం పరీక్షలు చేయించిన వారికి సాయంత్రం లేకుంటే రెండవ రోజు రిపోర్టులు ఇస్తున్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి ఒక రోజు వృథా అవుతోంది. దీనికి తోడు విద్యుత్ అంతరాయంతో ఉక్కపోతకు గురై గర్భిణులు అల్లాడుతున్నారు.


