రాష్ట్ర కోఆర్డినేటర్ హేమలత
నరసరావుపేట: సామాన్య ప్రజలు, దళిత, గిరిజన వర్గాలు బడ్జెట్ను తమకు సంబంధం లేని విషయంగా భావించడం ఆందోళనకరమని, వ్యక్తిగత సామాజిక అభివృద్ధి, జీవన ప్రమాణాల మెరుగుదల అన్నీ బడ్జెట్తోనే సంబంధం కలిగి ఉంటాయని దళిత గిరిజన బడ్జెట్ వాచ్ రాష్ట్ర కోఆర్డినేటర్ ఎం హేమలత పేర్కొన్నారు. మంగళవారం నాల్గవ తరగతి ఉద్యోగుల భవనంలో దళిత, గిరిజన బడ్జెట్ వాచ్ జిల్లా కన్వీనర్ మల్లెల చిన్నప్ప అధ్యక్షతన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల బడ్జెట్పై విశ్లేషణ నిర్వహించారు. హేమలత మాట్లాడుతూ బడ్జెట్ అనేది కేవలం మేధావులు, విద్యావేత్తలు చర్చించే అంశం కాకుండా ప్రతి మనిషి జీవితంతో ముడిపడి ఉన్న అత్యంత కీలకమైన అంశమని అన్నారు. దళిత గిరిజన కోణంలో బడ్జెట్ అంటే ఇళ్ల నిర్మాణం, ఇళ్ల స్థలాలు, రహదారులు, విద్యుత్, డ్రైనేజ్, పాఠశాలలు వంటి మౌలిక వసతుల కోసం ప్రభుత్వం ఎంత కేటాయిస్తోంది, ఆ నిధులు ఎలా వినియోగం అవుతున్నాయనే విషయాలు ప్రజలు తప్పనిసరిగా తెలుసుకోవాలని సూచించారు. హ్యాండ్స్ ఆఫ్ కంపాషన్ డైరెక్టర్ ఆనంద్ మాట్లాడుతూ కేంద్ర బడ్జెట్లో దళిత, గిరిజన వర్గాల అభివృద్ధికి తగిన ప్రాధాన్యత ఇవ్వలేదని విమర్శించారు. కేటాయింపులు పెరిగినట్లు చూపించినప్పటికీ, అనేక సందర్భాల్లో నిధుల వినియోగం సమర్థవంతంగా జరగడం లేదని పేర్కొన్నారు. ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు అడపా మోహన్, లంబాడీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు నాయక్, ఎస్ఎస్వీ సంస్థ ప్రతినిధి రవి, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
పట్టణంలో జేసీ, ఎమ్మెల్యే పర్యటన
నరసరావుపేట: పల్నాడు జిల్లా జాయింట్ కలెక్టర్ సంజనా సింహతో కలిసి ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు మంగళవారం పట్టణంలోని 5, 6, 7వార్డుల్లో విస్తృతంగా పర్యటించారు. అక్కడ నివసిస్తున్న సుమారు 360 ఇళ్ల ప్రజలకు పొజిషన్ పట్టాలు ఇచ్చే అంశంపై సర్వేయర్ తోట సుధాకర్, టీపీఓ సాంబయ్యలతో చర్చించారు. ఎస్ఆర్కేటీ కాలనీలో పర్యటించి 18వ లైన్ సమీపంలో నివసిస్తున్న నిరుపేదలకు పట్టాలు ఇచ్చే అంశాన్ని పరిశీలించారు. దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న పట్టాల సమస్యను పరిష్కరించి అర్హులైన వారందరికీ త్వరలోనే పట్టాలు అందేలా చర్యలు తీసుకుంటామని జేసీ, ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. తహసీల్దార్ వేణుగోపాలరావు, టీడీపీ నాయకులు వాసిరెడ్డి రవి, రంగిశెట్టి రామకృష్ణ, తదితర అధికారులు, నాయకులు పాల్గొన్నారు.


