షోకాజ్‌ నోటీసుకు సమాధానం ఇవ్వాలి | - | Sakshi
Sakshi News home page

షోకాజ్‌ నోటీసుకు సమాధానం ఇవ్వాలి

Mar 25 2026 7:24 AM | Updated on Mar 25 2026 7:24 AM

టీడీపీ నేత, మాజీ కౌన్సిలర్‌ జాని మౌలాలి

నరసరావుపేట:పట్టణంలోని శ్రీరాంపురంలోని జామియా మసీదు పక్కన వక్ఫ్‌బోర్డు స్థలంలో మున్సిపల్‌ అనుమతులు లేకుండా నిర్మిస్తున్న అంజుమన్‌ షాపింగ్‌ కాంప్లెక్స్‌పై వక్ఫ్‌బోర్డు అధికారులు ఇచ్చిన షోకాజ్‌ నోటీసుకు టీడీపీ నేత రహమత్‌ ఆలీ సమాధానం చెప్పాలని మాజీ కౌన్సిలర్‌, టీడీపీ నాయకుడు, శ్రీరాంపురం జామియా మసీదు మేనేజ్‌మెంట్‌ కమిటీ సెక్రటరీ షేక్‌ జాని మౌలాలి డిమాండ్‌ చేశారు. ఈ మేరకు మంగళవారం ఒక వీడియా విడుదల చేశారు. రహమత్‌ ఆలీకి జామియా మసీదుతో ఎటువంటి సంబంధం లేదన్నారు. ఇప్పటివరకు రూ.కోటి వసూలు చేసి 90 రసీదులు రాశారని, వాటిని తీసుకొని వస్తే వాటిపై చర్చించేందుకు తాను సిద్ధమన్నారు. రహమత్‌ ఆలీకి షాపు లేకపోయినా 30వ నంబర్‌ షాపుకి విద్యుత్‌ మీటర్‌ కోసం దరఖాస్తు చేశాడని, షాపు లేకుండా ఏవిధంగా మీటర్‌ ఇచ్చారని ప్రశ్నించారు. చనిపోయిన వారి సంతకాలతో ఒక వినతిపత్రం రాసి ఎమ్మెల్యే డాక్టర్‌ చదలవాడ అరవిందబాబుకు ఇచ్చి అతడిని తప్పుదోవ పట్టించారన్నారు. డబ్బులు కట్టకపోతే పాతవారికి షాపులు లేవని ప్రకటనలు ఇవ్వటానికి వీరికేమి అధికారం లేదన్నారు. ఆ షాపింగ్‌ కాంప్లెక్స్‌కు తమకు ఎటువంటి సంబంధం లేదని మున్సిపల్‌ అధికారులు ఆర్‌టీఐ చట్టం కింద తమకు సమాచారం ఇచ్చారన్నారు. గుంటూరురోడ్డులోని పెద్దమసీదు వద్దనున్న ఐదుగురి వద్ద ఒక్కొక్కరి నుంచి రూ.5 లక్షలు, వరవకట్టలో ఒక మహిళ నుంచి రూ.7లక్షలు వసూలు చేశారన్నారు. దమ్ముంటే షోకాజ్‌ నోటీసుకు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement