నరసరావుపేట: జిల్లాలో దివ్యాంగులు ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన దివ్యాంగ శక్తి పథకం బుధవారం నుంచి అమలు చేస్తున్నట్టు జిల్లా ప్రజా రవాణా అధికారి జి.అజితకుమారి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్, పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ బస్సుల్లో రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించవచ్చన్నారు. నాన్స్టాప్ ఎక్స్ప్రెస్, అంతరాష్ట్ర అల్ట్రాడీలక్స్ సర్వీసులు, తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే సప్తగిరి బస్సుల్లో 50శాతం రాయితీ సౌకర్యం కల్పించబడిందన్నారు. ప్రయాణించే దివ్యాంగులు సర్టిఫికెట్ అందుబాటులో ఉంచుకోవాలన్నారు.
నరసరావుపేట ఆర్డీఓగా బాలకృష్ణ నియామకం
నరసరావుపేట: పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటకు రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ (ఆర్డీఓ)గా కె.బాలకృష్ణ నియమితులయ్యారు. మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం నిర్వహించిన బదిలీల్లో ఆయన నందిగామ ఆర్డీఓగా పనిచేస్తూ నరసరావు పేటకు బదిలీ అయ్యారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఇక్కడ పనిచేస్తున్న కె.మధులతను ప్రభుత్వం బదిలీ చేసిన విషయం విదితమే. ఇప్పటివరకు గురజాల ఆర్డీఓ మురళీకృష్ణ ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు.
సాగర్ నీటిమట్టం వివరాలు
విజయపురిసౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం మంగళవారం 536.00 అడుగులకు చేరింది. ఇది 180.0950 టీఎంసీలకు సమానం. సాగర్ జలాశయం నుంచి కుడి కాలువకు 8,023, ఎడమ కాలువకు 8,541, ప్రధాన జలవిద్యుత్ కేంద్రానికి 20,754, ఎస్ఎల్బీసీకి 2,000, వరద కాలువకు 300 క్యూసెక్కులు విడుదలవుతోంది. దీంతో సాగర్ జలాశయం నుంచి మొత్తం ఔట్ఫ్లోగా 39,618 క్యూసెక్కులు విడుదలవుతోంది.


