రొంపిచర్ల: మండల కేంద్రమైన రొంపిచర్లలో వేంచేసి ఉన్న శ్రీ బాలత్రిపుర సుందరీ సమేత శంకరస్వామి తిరునాళ్లను ఉగాది పర్వదినాన నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. ఇప్పటికే ఆలయ అధికారులు ఆలయానికి రంగులు వేసి ముస్తాబు చేశారు. ప్రతి ఏడాది ఉగాది పర్వదినాన స్వామి వారి ఉత్సవాలు నిర్వహించటం ఆనవాయితీగా వస్తుంది. ఈ దేవాలయం 13వ 14వ శతాబ్ద కాలంనాటిదిగా అక్కడి శాసనాలను బట్టి తెలుస్తోంది. కాకతీయుల కాలం నాటి పరిస్థితులు ఇక్కడ ప్రతిబింబిస్తున్నట్లు చరిత్రకారులు భావిస్తారు. కోట భీమరాజు, గణపతి దేవుని పరిపాలన కాలం నాటి శాసనాలు కూడా ఈ ప్రాంగణంలో ఉన్నాయి. ఆలయంలో కార్యక్రమాల నిర్వహణ, తిరునాళ్ల ఏర్పాట్లను ఆలయ ఈవో ఎం. వెంకటేశ్వరరెడ్డి పర్యవేక్షిస్తున్నారు.


