కలెక్టరేట్లో నివాళులర్పించిన కలెక్టర్, ఎమ్మెల్యే, నాయకులు
నరసరావుపేట: అమరజీవి పొట్టి శ్రీరాములు కేవలం తెలుగు ప్రజలకేగాక యావత్ భారతీయులకు ఆరాధ్యుడని జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలలో స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబుతో కలిసి పాల్గొన్నారు. అమరజీవి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ అమరజీవి ఆత్మార్పణతో తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రంతోపాటూ భాషా ప్రాతిపదికన రాష్ట్రాలు ఏర్పడ్డాయన్నారు. శ్రీరాములు లాంటి పట్టుదల ఉన్నవారు మరో పది మంది నా దగ్గర ఉంటే మనకు పదేళ్ల ముందే స్వాతంత్య్రం వచ్చేదని మహాత్మాగాంధీ కీర్తించడం ఆయన గొప్పతనానికి నిదర్శనమన్నారు. శ్రీరాములు స్ఫూర్తిని కొనసాగిస్తూ జిల్లా ప్రజలు దశదిశాభివృద్ధి సాధించాలని కలెక్టర్ ఆకాంక్షించారు. ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ తన సందేశం ఇచ్చారు. మున్సిపల్ మాజీ చైర్మన్ నాగసరపు సుబ్బరాయగుప్త, బులియన్ మర్చంట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కపలవాయి విజయకుమార్, శ్రీ కళావేదిక వ్యవస్థాపక అధ్యక్షులు పొన్నపాటి ఈశ్వరరెడ్డి, బీసీ సంక్షేమసంఘ నాయకులు బాదుగున్నల శ్రీను పాల్గొన్నారు.


