జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా పీజీఆర్ఎస్లో 106, రెవెన్యూ క్లినిక్లో 29 అర్జీలు స్వీకరణ
నరసరావుపేట: ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్), రెవెన్యూ క్లినిక్లకు వచ్చే అర్జీల పరిష్కారానికి అధికారులు ప్రత్యేక దృష్టిలో పనిచేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన పీజీఆర్ఎస్కు జిల్లా కలెక్టర్, రెవెన్యూ క్లినిక్కు జాయింట్ కలెక్టర్ సంజనా సింహ అధ్యక్షత వహించి జిల్లాలోని ఆయా మండలాల నుంచి వివిధ రకాల సమస్యలతో వచ్చిన అర్జీదారుల నుంచి 135 అర్జీలు స్వీకరించారు. వీటిలో రెవెన్యూ క్లినిక్ ద్వారా 29 అర్జీలు స్వీకరించగా వాటిలో నరసరావుపేట డివిజన్ నుంచి 17, గురజాలకు చెందిన ఎనిమిది, సత్తెనపల్లి నుంచి నాలుగు స్వీకరించారు. కలెక్టర్ మాట్లాడుతూ అర్జీలను నాణ్యతగా, సకాలంలో పరిష్కరించాలని, గ్రీవెన్స్పై ఆడిట్ నిర్వహించాలన్నారు. అర్జీదారులతో మాట్లాడాలని, పెండింగ్ ఆడిట్ పూర్తి చేయాలన్నారు. జిల్లా అధికారులు వారి పరిధిలో ఎలాంటి పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. డీఆర్ఓ నారదముని, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.
ఏడేళ్లుగా మా గ్రామంలోని చెరువు నుంచి మురుగు నీరు సరఫరా చేస్తున్నారు. ఆ నీరు తాగలేక సమీప గ్రామాల నుంచి తెచ్చుకుంటున్నాం. పంచాయతీరాజ్ డీఈకి ఫిర్యాదు చేస్తే వచ్చి చూసి వెళ్లారు. చెరువుకి ఐదు ఫిల్టర్ బెడ్లు, రెండు ఓవర్హెడ్ ట్యాంకులు ఉన్నాయి. ఏవీ పనిచేయట్లేదు. ఇప్పటికై నా మంచినీరు సరఫరా చేయగలరు.
– పోలయ్య, గోవిందపురం,
చిలకలూరిపేట మండలం


