
పల్నాడుకు మెరుగైన వైద్యం కలేనా!
వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో 90 శాతం పనులు పూర్తి కూటమి ప్రభుత్వం వచ్చాక ఆగిన పనులు ప్రైవేట్ పరం చేసేందుకు యత్నాలు
నేడు వైఎస్సార్ సీపీ చలో మెడికల్ కళాశాల
పల్నాడు ప్రజలకు మెడికల్ విద్య, మెరుగైన వైద్యం అందని ద్రాక్షగా ఉంది. సకాలంలో మెరుగైన వైద్యం అందక పల్నాడు ప్రాంత ప్రజలు అనేక ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆ ప్రాంత విద్యార్థులకు మెడికల్ విద్యను అందుబాటులోకి తీసుకురావడంతోపాటు మెరుగైన వైద్య సేవలు అందించాలని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి భావించారు. దీంతో పిడుగురాళ్ల మండలం కామేపల్లిలో మెడికల్ కళాశాల, ఆస్పత్రికి శ్రీకారం చుట్టారు. రూ.500 కోట్లు మంజూరు చేయడమే కాక పనులు చురుగ్గా సాగేలా చర్యలు తీసుకున్నారు. పల్నాడు ప్రాంత ప్రజలు ఎంతో సంతోషించారు. కానీ ఆ సంతోషం ఎంతో కాలం నిలువ లేదు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం పనులు నిలిపివేసింది. అంతేగాక ప్రైవేట్పరం చేసేందుకు యత్నాలు ప్రారంభించింది.
పిడుగురాళ్లరూరల్/పిడుగురాళ్ల: పేదవాడికి అధునాతనమైన వైద్యం అందించాలని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పల్నాడు ప్రాంతంలోని అన్ని నియోజకవర్గాలకు దగ్గర ఉండే విధంగా పిడుగురాళ్ల మండలం కామేపల్లి గ్రామ సమీపంలో వైఎస్సార్ మెడికల్ కళాశాల, వైద్యశాలకు రూ.500 కోట్ల నిధులు మంజూరు చేయించారు. దీంతో ఎంతో మంది పేద ప్రజలు మనకు దగ్గరలోనే అధునాతనమైన వైద్యం అందుతుందని ఆశపడ్డారు. తీరా కూటమి ప్రభుత్వం గెలుపొందటంతో వైఎస్సార్ మెడికల్ కళాశాలకు చంద్ర గ్రహణం పట్టింది. పేదల ఆశలపై నీళ్లు చల్లినట్లు అయింది. ఏడాదిన్నర కావస్తున్నా పనులు మాత్రం ముందుకు సాగడం లేదు.
వైఎస్సార్ సీపీ హయాంలో 90 శాతం పనులు పూర్తి
పల్నాడు ప్రాంత ప్రజలంతా ఆరోగ్యం సేవల కోసం గుంటూరు, విజయవాడ, హైదరాబాద్ వంటి సుదూర ప్రాంతాలకు వెళ్తున్నారని గుర్తించిన గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. జగన్మోహన్రెడ్డి మెడికల్ కళాశాలను మంజూరు చేశారు. వెంటనే పనులు ప్రారంభించారు. కరోనా వచ్చినా శరవేగంగా పనులు జరిగేలా అన్ని చర్యలు తీసుకున్నారు. మెడికల్ కళాశాల, వైద్యశాల పనులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ పూర్తి చేసే విధంగా కాంట్రాక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో హాస్పటల్లో 100 పడకల బ్లాక్ పనులు పూర్తి చేయించి పేదలకు వైద్యం అందించేలా ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్లారు. 100 పడకల హాస్పటల్కు ఫర్నిచర్ తీసుకొని వచ్చి వైద్యులను, సిబ్బందిని నియమించినట్లయితే మెడికల్ కళాశాలలో వైద్యం సేవలు పేదవాడికి అందేవి. కానీ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఆ మెడికల్ కళాశాల వైపు కన్నెత్తి కూడా చూడలేదు. మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డి మెడికల్ కళాశాల పనులు పూర్తి చేయాలంటూ సెల్ఫీ చాలెంజ్లు విసిరారు. దీంతో పట్టణ, పల్నాడు ప్రాంత ప్రజలు, ప్రవాస భారతీయులు సైతం సెల్ఫీ చాలెంజ్లు విసిరారు. దీంతో హుటాహుటిన కూటమి నాయకులు మెడికల్ కళాశాల, వైద్యశాలను పరిశీలించారు.
9 నెలల్లో రూ.9 లక్షలు ఖర్చు చేసిన కూటమి ప్రభుత్వం
పేదవాడికి ఎక్కడ ఖరుదైన వైద్యం అందుతుందోనని కూటమి ప్రభుత్వం మెడికల్ కళాశాల, వైద్యశాల పనులను సాగనివ్వటం లేదు. పనులు సాగి వైద్యశాల పూర్తి అయితే వైఎస్సార్ సీపీకి, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డికి ఎక్కడ పేరు వస్తుందో అనే అక్కసుతో పనులను సాగనివ్వటం లేదు. దీనికి సాక్ష్యం తొమ్మిది నెలల్లో కూటమి ప్రభుత్వం కేవలం రూ.9 లక్షలు ఖర్చు చేసిందంటే పల్నాడు ప్రాంత ప్రజలు సైతం ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురవుతున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ కళాశాలను ప్రైవేటు పరం చేస్తుండటంతో వైఎస్సార్ సీపీ యువజన విభాగం, అనుబంధ విభాగాల ఆధ్వర్యంలో శుక్రవారం పిడుగురాళ్ల పట్టణం నుంచి కామేపల్లి మెడికల్ కళాశాల వరకు మెడికల్ కళాశాల, వైద్యశాల సందర్శించనున్నారు. ఈ నేపథ్యంలో పల్నాడు జిల్లా నుంచి వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరై విజయవంతం చేయనున్నారు.

పల్నాడుకు మెరుగైన వైద్యం కలేనా!

పల్నాడుకు మెరుగైన వైద్యం కలేనా!