
సాగర్మాత దేవాలయంలో ఈస్టర్ వేడుకలు
విజయపురిసౌత్: స్థానిక సాగర్మాత దేవాలయంలో ఈస్టర్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. శనివారం రాత్రి నుంచే ఆలయంలో ప్రత్యేక ఆరాధన కార్యక్రమాలు జరిగాయి. అర్థరాత్రి 12 గంటలకు ఆలయ ప్రాంగణంలో భక్తులు కొవ్వొత్తులతో ప్రదర్శన నిర్వహించారు. ఆ తరువాత క్రీస్తు నేడు లేచెను అని నినాదాలు చేశారు. అనంతరం భక్తులు ఒకరికొకరు ఈస్టర్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. దివ్యబలిపూజా కార్యక్రమంలో ఆలయ విచారణ గురువులు పామిశెట్టి జోసఫ్ బాలసాగర్ భక్తులనుద్ధేశించి ప్రసంగించారు. సమాజంలో ప్రతి ఒక్కరూ చెడుమార్గాన్ని వీడి మంచి మార్గంలో నడవాలన్నారు. ఆశాంతిని వీడి శాంతి మార్గంలో, ద్వేషాన్ని వీడి తోటివారితో ప్రేమతో మెలగాలని సూచించారు. 2వేల సంవత్సరాల క్రితం శిలువ వేయబడి చనిపోయిన ఏసుక్రీస్తు మూడో రోజు ఆదివారం పునరుత్ధానుడైనట్లు ఉద్భోధించారు. ఈ పునరుత్థానుడైన క్రీస్తును స్మరించుకోవటమే ఈస్టర్ పండుగ ముఖ్య ఉద్ధేశమన్నారు. ఏసు చూపిన మార్గంలో నడవాలని వారు పేర్కొన్నారు.
వేడుకలలో ఆలయ పెద్దలు డి ఇన్నారెడ్డి, ఎం మరియదాసు, జెక్కిరెడ్డి చిన్నపరెడ్డి, శౌర్రాజు, శౌరిబాబు, కట్టా రాజు, చందు, అజయ్ తదితరులు పాల్గొన్నారు.