భువనేశ్వర్: రథయాత్రలో ఐదో రోజు హేరా పంచమి. పూరీలోని జగన్నాథ ధామంలో జరిగే రథయాత్రలోని అత్యంత విశిష్టమైన ఆచారాలలో ఒకటైన హేరా పంచమి సోమ వారం నిర్వహించారు. హేరా పంచమి రోజున శ్రీ మహాలక్ష్మి దేవి గుండిచా ఆలయానికి వెళ్లిన శ్రీజగన్నాథుడిపై అలక వ్యక్తం చేస్తూ నందిఘోష రథానికి స్వల్ప నష్టం కలిగించే లీలను ఆచరిస్తుంది. ఈ దివ్యలీల దాంపత్య ప్రేమ, అలక, అనురాగాలకు ప్రతీకగా భావిస్తారు. ఈ రోజు జగత్తంతా మహాలక్ష్మి దేవి ఆగ్రహాన్ని దర్శించింది. తనకు తెలియజేయకుండా శ్రీ మందిరాన్ని విడిచి వెళ్లినందుకు మహాప్రభువుపై ప్రియ సఖి శ్రీ మహా లక్ష్మి జగతి నాథునిపై అలక ప్రదర్శిస్తుంది. సువిశాల శ్రీ మందరంలో తనకు ఒంటరిగా వీడి స్వామి యాత్రకు వెళ్లడంతో విరహం తాళలేని లక్ష్మీదేవి ఐదో రోజున చీకటి పడిన తర్వాత రత్న శోభిత పల్లకిలో ఊరేగింపుగా శ్రీ గుండిచా ఆలయానికి ప్రయాణించడం హేరా పంచమి వేడుకగా నిర్వహించడం భక్త జనులకు ముచ్చట గొలిపే సన్నివేశం. భక్తి, దైవ ప్రేమ, ఆరాటం లక్ష్మీదేవి, మహా ప్రభువు శ్రీ జగన్నాథుని మధ్య ఉన్న ఆత్మీయ బంధాన్ని అందంగా ప్రతిబింబించే ఒక కాలాతీత సంప్రదాయంగా ఈ వేడుకని పేర్కొంటారు.
హెరా పంచామిలో భక్తుల సందడి
రాయగడ: జగన్నాథ రథయాత్ర ఉత్సవాల్లో భాగంగా సోమవారం హెరాపంచమిని పురస్కరించుకుని స్థానిక గుండిచా మందిరలో కొలువైయున్న జగన్నాథ, బలభద్ర, శుభద్ర దేవతా మూర్తులు ప్రత్యేక పూజలందుకున్నారు. ఈ సందర్భంగా జగన్నాథడు దశవతారాల్లో భాగంగా నృసింహ అవతారంల్లో భక్తులకు దర్శన భాగ్యం కలిగించారు. భక్తులు స్వామి వారి దివ్యదర్శనాన్ని చూసి తరించేందుకు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. దీంతో గుండిచా మందిరం భక్తులతో కిటకిటలాడింది. స్వామి వారి దర్శనం కోసం గంటల సమయం పట్టింది. అయితే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసారు. క్యూ లైన్ ద్వారా వారిని గుండిచా మందిరం లోపలకు వెళ్లేలా ఏర్పాట్లు చేశారు.


