92 శాతం ప్రజా ఫిర్యాదులు పరిష్కారం | - | Sakshi
Sakshi News home page

92 శాతం ప్రజా ఫిర్యాదులు పరిష్కారం

Jun 2 2026 6:05 AM | Updated on Jun 2 2026 6:05 AM

భువనేశ్వర్‌: స్థానిక యూనిట్‌ 2లోని సోమవారం జరిగిన ముఖ్యమంత్రి ఫిర్యాదుల విచారణ శిబిరంలో ముఖ్యమంత్రి మోహన్‌ చరణ్‌ మాఝీ ప్రజల ఫిర్యాదులను ప్రత్యక్షంగా పరిశీలించి తక్షణ ఉత్తర్వులు జారీ చేశారు. ముఖ్యమంత్రితో పాటు మంత్రి వర్గంలో 13 మంది సీనియర్‌ మంత్రులు హాజరై ప్రజల ఫిర్యాదులను విన్నారు. సోమవారం ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ రెండింటి ద్వారా 600కు పైగా ఫిర్యాదులు నమోదయ్యాయి. రెండేళ్ల పాలనలో ముఖ్యమంత్రి వరుసగా 18 సార్లు ప్రజా ఫిర్యాదుల విచారణలో పాలుపంచుకోవడం విశేషం. తొలుత బయట వేచి ఉన్న 30 మంది దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారిని కలిసి వారి సమస్యలను విన్నారు. వారి ఫిర్యాదు పత్రాలను స్వీకరించి తక్షణ చర్యలు తీసుకోవాలని అక్కడున్న అధికారులను ఆదేశించారు. ఆ తర్వాత గది లోపల నమోదు చేసుకున్న ఫిర్యాదుదారుల ఫిర్యాదులను పరిష్కరించారు. సింగిల్‌ విండో వ్యవస్థ ద్వారా వివిధ వ్యాధులతో బాధపడుతున్న సుమారు 13 మంది ఫిర్యాదుదారులకు వైద్య సహాయంగా రూ. 3.60 లక్షలు ముఖ్యమంత్రి మంజూరు చేశారు. నయాగఢ్‌ జిల్లాకు చెందిన కామాక్షి సాహు కుమారుడి దుర్ఘటన మృతికి కారుణ్య సహాయంగా ముఖ్యమంత్రి రూ. 2 లక్షలు మంజూరు చేశారు.

జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్‌, పోలీస్‌ సూపరింటెండెంట్లు ప్రజల సమస్యలను క్రమం తప్పకుండా వింటుండగా, తహసీల్‌, మండల స్థాయిలో ఫిర్యాదుల పరిష్కారం నిరంతరం కొనసాగుతోంది. ఈ ఏడాది ఏప్రిల్‌ వరకు జిల్లా స్థాయిలో 2.40 లక్షల ఫిర్యాదులను విచారించగా వాటిలో 92 శాతం పరిష్కరించినట్లు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement