కొరాపుట్: అమాయక రైతులను గోవుల అక్రమ రవాణాదారులంటూ తీవ్రంగా వేధించారు. నబరంగ్పూర్ జిల్లా చందాహండి సమితి లుధుపోడ గ్రామం సమీపంలో రాయిఘర్ సమితి బరుసుండి గ్రామానికి చెందిన ఐదుగురు రైతులు ఆవులతో వెళ్లడం గ్రామస్తులు గమనించారు. ఈ సమాచారం భజరంగ్దళ్ కార్యకర్తలకు సమాచారం వచ్చింది. వారు వెంటనే రైతుల వద్దకు వచ్చి భౌతిక దాడులు చేశారు. ఈ ఆవులను విక్రయించడానికి తీసుకొని వెళ్తున్నారని ఆరోపించారు. వాటిని వధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దానికి రైతులు స్పందిస్తూ తాము ఆవులు కొనగోలు చేశామని, వాటిని వ్యవసాయ పనుల కోసం తీసుకొని వెళ్తున్నామని వివరించారు. అనంతరం రైతులను మండుటెండలో మోకాళ్ల మీద నడిపించారు. చెవులు పట్టుకొని గుంజీలు తీయించారు. ఇది తెలిసి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని రైతులను తమ వాహనంలో పోలీస్ స్టేషన్ కి తరలించారు. ఈ వీడియోలు ఆలస్యంగా వెలుగు చూశాయి. ఈ ఘటన పై దళిత, మైనారిటీ,గిరిజన సంఘాలు మండి పడ్డాయి. దళిత నాయకుడు కెమరాజ్ బాగ్ నేత్రుత్వం లో చందాహండి పోలీస్ స్టేషన్ ని ముట్టడించారు. స్టేషన్ వద్ద ఆందోళన చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని, బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.


