జయపురం: మల్కనగిరి–జయపురం రైల్వే లైన్ నిర్మాణం కోసం భూములు ఇచ్చిన వారికి సముచితమైన పరిహారం చెల్లించాలని బాధితులు డిమాండ్ చేశారు. ఈ మేరకు జయపురం సమితి పంపుణీ గ్రామంలో భూములు కోల్పోయిన రైతులు, ప్రజలు గురువారం సమావేశమయ్యారు. తమ భూములకు ప్రభుత్వ ప్రకటించిన ధర చాలా తక్కవగా ఉందని.. మార్కెట్ ధర చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. అక్షయ కుమార్ మిశ్ర అధ్యక్షతన జరిగిన సమావేశంలో భూములు కోల్పోయిన వారంతా సంఘంగా ఏర్పాటై న్యాయమైన పరిహారం చెల్లించే వరకు పోరాడాలని సమావేశంలో తీర్మానించారు. భూములకు తగిన ధర చెల్లించటంతో పాటు ప్రతి కుటుంబంలో ఒకరికి రైల్వేలో ఉద్యోగాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. తగిన న్యాయం జరగకపోతే ఆందోళన చేయాలని కొంత మంది సూచించారు.


