జయపురం: జయపురం విక్రమదేవ్ విశ్వవిద్యాలయంలో నిర్వహిస్తున్న ఎన్సీసీ శిక్షణ శిబిరంలో కేడెట్లకు ప్రమాద సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ప్రమాదాలను ఎదుర్కొనటం, ప్రాణాలను రక్షించే నైపుణ్యాలపై అవగాహన కల్పించేందుకు కొరాపుట్ ఓడ్రాఫ్ బృందం ఓ ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేసింది. అనుభవజ్ఞులైన హవల్దార్ టీఆర్ కుమార్ ప్రత్యేక పర్యవేక్షణలో శిక్షణాకార్యక్రమం జరిగింది. భూకంపాలు, భవనాలు కూలిన సమయంలో గాయపడిన వారిని ఎలా సురక్షితంగా బయటకు తీసుకు రావాలి తదితర రెస్క్యూ ఆపరేషన్ పద్ధతులు నేర్పించారు. లైఫ్జాకెట్లు, బోట్లు వరదల సమయంలో ఎలా వినియోగించాలో చెప్పారు. ప్రథమ చికిత్స పద్ధతులు వివరించారు.


