భువనేశ్వర్: రైతుల ఆదాయం పెంపొందించే దిశలో వ్యవసాయ రంగం సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. మంగళ వారం నగరంలో తూర్పు జోనల్ వ్యవసాయ సదస్సు 2026 ప్రారంభం పురస్కరించుకుని ఆయన ప్రసంగించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ, వ్యవసాయ శాఖ బాధ్యతలు వహిస్తున్న ఉప ముఖ్యమంత్రి కనక వర్ధన్ సింగ్ దేవ్ తదితర ప్రముఖుల సమక్షంలో కేంద్ర మంత్రి జ్యోతి ప్రజ్వలన, మొక్కలకు నీరు పోసి సదస్సుని లాంచనంగా ప్రారంభించారు. వ్యవసాయ రంగానికి సంబంధించిన కీలక సమస్యలపై ఈ సదస్సులో లోతుగా చర్చ కొనసాగుతుంది. ఈ సదస్సులో తూర్పు భారత దేశం నుంచి ఒడిశా, పశ్చిమ బెంగాల్, బీహార్, ఛత్తీస్గఢ్ మరియు జార్ఖండ్ రాష్ట్రాలు పాల్గొన్నాయి.
వ్యవసాయ రంగానికి సంబంధించిన వివిధ పథకాలు, కార్యక్రమాలపై కేంద్రీకృత చర్చల ద్వారా కేంద్ర–రాష్ట్ర సమన్వయాన్ని బలోపేతం చేయడం, రైతుల ఆదాయాన్ని పెంపొందించడం మరియు వ్యవసాయ రంగం సమగ్ర అభివృద్ధిని ప్రోత్సహించడం ఈ సదస్సు లక్ష్యాలుగా పేర్కొన్నారు.


