కాంగ్రెస్‌ దివిటీల ర్యాలీ | - | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ దివిటీల ర్యాలీ

May 18 2026 10:01 AM | Updated on May 18 2026 10:01 AM

జయపురం: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పాలనను నిరసిస్తూ కాంగ్రెస్‌ పార్టీ దివిటీలతో ర్యాలీ నిర్వహించింది. జయపురం సబ్‌డివిజన్‌ కొట్‌పాడ్‌ పట్టణంలో శనివారం సాయంత్రం నిర్వహించిన ర్యాలీలో ప్రధాన మంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పార్లమెంట్‌లో మహిళలకు సంబంధించిన 33 శాతం రిజర్వేషన్‌ బిల్లు ఓటమిపై ప్రతిపక్షాలను నిందిస్తున్న బీజేపీ పాలకులు, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మహిళలను మోసగిస్తున్నారని, ఆ బిల్లు 2023 లోనే లోక్‌ సభలో పాసైనా ఎందుకు అమలు చేయటం లేదని ప్రశ్నించారు. ఇది మహిళలను మోసం చేయటం కాదా అని ప్రశ్నించారు. బీజేపీ పాలనలో బీజేపీ నేతలే అత్యాచారాలు చేస్తున్నారని, అయినా ప్రధాని స్పందించడం లేదని, నీట్‌ ప్రశ్న పత్రం లీకై ందని అయినా నోరు విప్పడం లేదని అన్నారు. కొట్‌పాడ్‌ కాంగ్రెస్‌ కార్యాలయం నుంచి బయల్దేరి మహాత్మా గాంధీ విగ్రహం వద్దకు చేరి అక్కడ బహిరంగ సభ నిర్వహించారు. అనామ్‌ దియాన్‌, కొట్‌పాడ్‌ నోటిఫైడ్‌ ఏరియా కౌన్సిల్‌(ఎన్‌.ఎ.సి) చైర్మన్‌ ఎమ్‌.శంకర రావు, కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత న్యాయవాది సంఘ అధ్యక్షుడు మణి ప్రసాద్‌ పట్నాయిక్‌, కాంగ్రెస్‌ నేతలు మనోహర బిశాయి,శంకర పండ, రహెమాన్‌ ఖాన్‌,యూసఫ్‌ ఆలీ, నవీణ బిశాయి, జితేంధ్ర మహాపాత్రో తదితరులు పాల్గొన్నారు.

జయపురంలో జనాక్రోశ్‌ ర్యాలీ

జయపురం: జయపురం సమితి డొంగరచించి గ్రామంలో బీజేపీ మహిళా మోర్చ ఆదివారం జనాక్రోస్‌ ర్యాలీ నిర్వహించింది. కొరాపుట్‌ జిల్లా బీజేపీ ఉపాధ్యక్షుడు ప్రభారి సుదాంశు శేఖర జెన పర్యవేక్షణలో బీజేపీ మండల అధ్యక్షులు ధీనబందు ప్రధాన్‌ నేతృత్వంలో ర్యాలీ జరిగింది. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ శాశ్వత సభ్యులు గౌతమ సామంత రాయ్‌ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మహిళల రిజర్వేషన్‌ బిల్లు విపక్షాలు వ్యతిరేకించడం ద్రోహమని అన్నారు. కార్యక్రమంలో జిల్లా బీజేపీ మహిళ మోర్చా అధ్యక్షురాలు స్వాతీ హొత, ఉపాధ్యక్షురాలు సీమా కరణొ, సభ్యులు సుకల్‌ దేయి గదబ, రామ గదబ, భవానీ రెడ్డి, సునీత గదబ, మొతీ చపాడీ, రాధా రాణ, గాయిత్రీ నాయిక్‌, హీరామణి హరిజన్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement